బీహార్లో మారిపోతున్న సమీకరణలు

బీహార్లో రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారిపోతున్నాయి. బీజేపీతో తెగతెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ మహాఘట్ బంధన్ తో జతకట్టి మళ్ళీ ముఖ్యమంత్రయిపోయారు. మహాఘట్ బంధన్ అంటే ఆర్జేడీ+కాంగ్రెస్+వామపక్షాలు + ఎంఐఎం+ స్వతంత్ర ఎంఎల్ఏలు. 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్లో ఎవరు అధికారంలోకి రావవాలన్నా మ్యాజిక్ ఫిగర్ 122 మంది ఎంఎల్ఏలు. ప్రస్తుతం కొత్తకూటమికి 164 మంది ఎంఎల్ఏల బలముంది.

అవసరానికి మించిన బలమే ఉందికాబట్టి నితీష్ కుమార్ చాలా ఈజీగా బలాన్ని నిరూపించుకుంటారు. అయితే అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 122కి ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ మరో ఇద్దరు ఎంఎల్ఏల మద్దతుకు మాత్రమే దూరంగా ఉన్నారు. తన కూటమి మొత్తం బలం ప్రస్తుతం 120గా ఉంది. అంటే మరో ఇద్దరు కానీ లేదా అంతకన్నా ఎక్కువమంది ఎంఎల్ఏలు జై కొడితే వెంటనే తేజస్వి ముఖ్యమంత్రి అయిపోవటం ఖాయం. ఇందుకు జేడీయూ అధినేత నితీష్ ప్రమేయం అవసరమేలేదు.

ఇలాంటి పరిస్ధితుల్లో మరి తేజస్వి తానే సీఎంగా ప్రయత్నించకుండా నితీష్ కు ఎందుకు మద్దతిచ్చినట్లు ? ఎందుకంటే ముందు బీజేపీని అధికారానికి దూరంచేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టి. నితీష్ – బీజేపీ గొడవలతో ఆపని తేజస్వి ప్రమేయంలేకుండానే జరిగిపోయింది. అందుకనే తక్షణావసరంగా ఆర్జేడీ చీఫ్ నితీష్ కు మద్దతిచ్చి ముఖ్యమంత్రి స్ధానంలో కూర్చునే అవకాశమిచ్చారు. అయితే రేపు ఏదైనా తేడావస్తే మాత్రం మద్దతు ఉపసంహరించుకునేందుకు తేజస్వి ఏమాత్రం వెనకాడరని అందరికీ తెలిసిందే.

తన ప్రయోజనాలను పరిరక్షిస్తానంటే ఎవరికైనా మద్దతు ఇవ్వటానికి ఎప్పుడూ రెడీగా ఉండే మాజీముఖ్యమంత్రి జీతన్ రామ్ మంఝీ కి కూడా కొందరు ఎంఎల్ఏలు ఉన్నారట. ప్రస్తుతం మాంఝీ జేడీయుతోనే ఉన్నారు. ఒకవేళ వీళ్ళద్దరికీ చెడిందంటే మాంఝీ చూపు వెంటనే తేజస్వి వైపు వెళుతుంది. అప్పుడైనా తేజస్వీ సీఎం అయ్యే అవకాశముంది. సో క్షేత్రస్ధాయిలో ఉన్న అవకాశాల ప్రకారం తేజస్వీ సీఎం అవ్వదలచుకుంటే వచ్చే ఎన్నికలవరకు కూడా ఆగక్కర్లేదు.