దెబ్బకు వెనక్కు తగ్గిన కేసీయార్?

మునుగోడు ఉపఎన్నికలో అభ్యర్ధి ఎంపిక విషయంలో కేసీయార్ వెనక్కు తగ్గినట్లే ఉంది. మొన్నటివరకు కూసుకుంట్ల ప్రభాకరరెడ్డే అభ్యర్ధిగా పార్టీలో బాగా ప్రచారమైంది. ముందు మంత్రి జగదీశ్వరరెడ్డి, తర్వాత కేసీయార్ కూడా నేతలతో జరిపిన సమావేశంలో కూసుకుంట్లే అభ్యర్ధి అన్నట్లుగా మాట్లాడారు. అయితే వీళ్ళు ఊహించని విధంగా కూసుకుంట్లకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని సుమారు 40 మంది నేతలు ఎదురుతిరిగారు. వీళ్ళని కన్వీన్స్ చేయటానికి ఎంత ప్రయత్నించినా కేసీయార్ వల్లకాలేదు.

దాంతో తాజాగా పార్టీ నేతలతో మాట్లాడుతు అభ్యర్ధిని ఇంకా ఎంపికచేయలేదని ప్రకటించారు. ఎవరిని అభ్యర్ధిగా ప్రకటించినా నేతలంతా గెలుపుకోసం కష్టపడాలని విజ్ఞప్తిచేశారు. శనివారం మూడు విడుతలుగా కేసీయార్ నేతలతో మాట్లాడిన కూసుకుంట్లతో మాత్రం భేటీ జరపలేదు. వివిధ భేటీల్లో కూసుకుంట్ల ప్రస్తావన కూడా కేసీయార్ తేలేదని సమాచారం. అభ్యర్ధి ఎంపిక విషయంలో నల్గొండ ఎంఎల్ఏ కంచర్ల భూపాలరెడ్డి సోదరులతో కూడా మాట్లాడారు.

మొత్తానికి అభ్యర్ధి ఎంపిక విషయం ఏకపక్షంగా సాధ్యంకాదని కేసీయార్ కు బాగా అర్ధమైపోయింది. మామూలుగా అయితే అధినేత తీసుకున్న నిర్ణయాన్ని పార్టీలోని నేతలు థిక్కరించేంత సాహసంచేయరు. తమకు ఏదన్నా అసంతృప్తి ఉంటే విడిగా మాట్లాడుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం కేసీయార్ మొహంమీద తమ అసంతృప్తిని నేతలు చెప్పేశారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మార్కెట్ యార్డ్ కమిటీల ఛైర్మన్లు, సర్పంచులు వ్యతిరేకిస్తున్న కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికే టికెట్ ఇస్తారా లేకపోతే అభ్యర్ధిని మారుస్తారా అనేది చూడాలి.

ఇంతమంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేతను అభ్యర్ధిగా ఎంపికచేస్తే అందరు కలిసి పుట్టిముంచేస్తే ఫలితం దారుణంగా ఉంటుంది. అభ్యర్ధి ఓడిపోతే పోయేది తనపరువే అని కేసీయార్ కు తెలీదా ? ఒకవైపు కేసీయార్ పాలనపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోతోందనే ప్రచారం. మరోవైపు ఎన్నికలు ఎప్పుడు జరిగినా అధికారంలోకి వచ్చేది తామే అంటు కాంగ్రెస్, బీజేపీ గోల. ఈ నేపధ్యంలో కేసీయార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.