కాంగ్రెస్ రాత మారుతుందా?

దక్షిణాది రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా ప్రయాంకగాంధి నియమితులయ్యారు. ఇప్పటివరకు ఇన్చార్జిలుగా ఉన్నవారి వల్ల ఎలాంటి ఉపయోగం కనబడలేదు. మిగిలిన రాష్ట్రాల సంగతి వదిలేసినా ఏపీకి ఊమెన్ చాంది, తెలంగాణాకు మాణిక్కం ఠాగూర్ ఇన్చార్జిలుగా ఉన్నారు. అయితే వీరిద్దరి వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం కనబడలేదు. తెలంగాణాలో పార్టీకి కొద్దొగొప్పో నేతలున్నారు కానీ ఏపీలో అయితే ఇంకా సమాధిస్ధితిలోనే ఉంది పార్టీ.

నిజానికి మెజారిటి జనాల అభిమతానికి విరుద్ధంగా కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధి సమైక్య రాష్ట్రాన్ని చీల్చేశారు. జరిగిన విభజన కూడా అడ్డుగోలుగా జరిగింది. ఏపీ భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి భరోసా ఇవ్వకుండానే, ఏపీ ప్రయోజనాలను కాపాడకుండానే ఏకపక్షంగా విభజన నిర్ణయం తీసుకున్నారు. అప్పటివరకు పచ్చగా కళకళలాడుతున్న సమైక్య రాష్ట్రం సోనియా నిర్ణయంతో దుంపనాశనమైపోయింది.

రాష్ట్ర విభజన చేసి తెలంగాణాలో లాభపడిందిలేదు. ఏపీలో పార్టీకి సోనియానే సమాధి నిర్మించేశారు. దీని ప్రభావం 2014 ఎన్నికల్లో పార్టీతో పాటు యూపీఏపైన కూడా పడింది. అప్పటినుండి రెండురాష్ట్రాల్లో పార్టీకి దిక్కుమొక్కులేకుండా అవస్తలు పడుతోంది. కాబట్టి పార్టీకి ఎంతమంది ఇన్చార్జిలను మార్చినా ఉపయోగముండదు. కారణం ఏమిటంటే తెలంగాణాలో అధికారంలోకి రావటం కాంగ్రెస్ నేతలకు ఇష్టంలేదన్నట్లుగా ఉంది. వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయారంటేనే జనాలు పార్టీని ఎంతగా చీకొడుతున్నారో అర్ధమైపోతోంది.

ప్రతిపక్షంలో కూర్చున్నా నేతలకు బుద్ధిరాలేదు. తాజాగా మునుగోడు ఉపఎన్నిక నేపధ్యంలో నేతల మధ్య ఎన్ని గొడవలు జరుగుతున్నాయో చూస్తుంటే ప్రజలకు చీదరపుడుతోంది. ఇక ఏపీలో అయితే పార్టీ శవాసనంలోనే ఉండిపోయింది. ప్రియాంక గాంధీ కాదు స్వయంగా సోనియానే వచ్చినా పార్టీ బతికిబట్టకట్టేదిలేదు. పార్టీని స్వయంగా సోనియానే నాశనం చేసేసినాక ఇక ఎవరొచ్చినా బాగుచేసేదుండదు. తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తామే అని గొడవలు పడుతున్నారు. ఏపీలో అయితే అసలు టికెట్ తీసుకునేందుకు కూడా అభ్యర్ధులు లేక దిక్కులు చూస్తోంది పార్టీ. ఈ స్ధితిలో ఉన్న పార్టీని ప్రియాంక ఏమాత్రం ఉద్ధరిస్తారో చూడాలి.