వచ్చే ఎన్నికల బరిలో జీవిత

టాలీవుడ్ కు చెందిన ఏదో ఒక అంశంలో జీవితా రాజశేఖర్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఆ మధ్యన ఆమె బీజేపీ తీర్థం తీసుకోవటం తెలిసిందే. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న వేళ.. కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉన్న ఆమె.. వైఎస్ మీద విపరీతమైన అభిమానాన్ని ప్రదర్శించేవారు. ఆయన తరఫున మాట్లాడుతుండేవారు. రాజకీయంగా ఆయన నుంచి సాయం కోరినట్లు చెబుతారు. వైఎస్ అనూహ్య మరణం తర్వాత కాంగ్రెస్ తో ఆమె సంబంధాలు తగ్గాయని చెప్పాలి.

బీజేపీలో చురుగ్గా వ్యవహరిస్తున్నఆమె.. తాజాగా టీ బీజేపీ రథసారధిగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్నారు.
యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పొడిచేడుకు చేరుకున్న వేళ.. జీవితా రాజశేఖర్ సైతం బండి సంజయ్ తో కలిసి పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి పార్టీ కార్యక్రమాలకు హాజరుకానున్నట్లుఆమె చెప్పారు. అందుకే బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామయాత్రకు మద్దతు తెలిపేందుకు పాదయాత్రలో తాను పాల్గొన్నట్లు చెప్పారు. బండి సంజయ్ ఎంతో సమర్థవంతమైన నాయకుడని.. ప్రజల్లోకి ఆయన వెళుతున్న తీరు అద్భుతమని తెగ పొగిడేశారు.

ఇద్దరు ఆడపిల్లల తల్లిగా మహిళల కష్టాలు తెలిసినదానిని అంటూ మాట్లాడిన జీవిత.. ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పాలన ఎలా ఉందో అందరికి తెలుసు. ప్రజలెంతో కష్టపడుతున్నారు’’ సున్నిత విమర్శలు చేశారు. పార్టీ ఆదేశించాలే కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని తాను అనుకుంటున్నట్లు చెప్పారు. ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా పోటీ చేసేందుకు తాను సిద్దమని పేర్కొన్నారు. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసిన జీవిత.. మరే నియోజకవర్గానికి గురి పెట్టారో చూడాలి. మరి.. ఆమె వినతికి బీజేపీ ఏ రీతిలో రియాక్టు అవుతుందో మరి.