ఎమ్మెల్సీల్లో అత్యంత సంపన్నుడు లోకేశ్

ఏపీ ఎమ్మెల్సీలకు సంబంధించిన ఆస్తుల విషయంపై ఒక సంస్థ తాజాగా జరిపిన విశ్లేషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో మొత్తం 58 మంది ఉండగా.. 48 మంది ఆస్తులకు సంబంధించిన వివరాలు అందుబాటులోకి వచ్చాయని.. మిగిలిన 10 మంది ఎమ్మెల్సీల వివరాలు తమకు అందలేదని చెబుతోందిన సదరు సంస్థ. అందుబాటులో ఉన్న ఎమ్మెల్సీల వివరాల్లో అధికార వైసీపీకి 22 మంది ఉంటే.. విపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్సీలు 11 మంది ఉన్నారు.

తాము సేకరించిన వివరాల్ని విశ్లేషించినప్పుడు.. మండలి సభ్యుల్లో 75 శాతం మంది కోటీశ్వరులుగా గుర్తించినట్లు చెబుతోంది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ. దీనితో పాటు ఏపీ ఎలక్షన్ వాచ్ కూడా అధ్యయనాన్ని నిర్వహించింది. ఏపీ ఎమ్మెల్సీల్లో అత్యంత సంపన్నుడిగా టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ నిలిచారు. ఆయన ఆస్తి రూ.369 కోట్లకు పైనేనని తేల్చారు.

మండలిలో రెండో అత్యంత సంపన్న ఎమ్మెల్సీగా వాకాటి నారాయణ రెడ్డిగా తేల్చారు. ఆయన ఆస్తులు రూ.101 కోట్లుగా వెల్లడించారు. మూడో స్థానంలో రూ.36 కోట్లతో ఎమ్మెల్సీ మాధవరావు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇక.. అతి తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్సీగా స్వతంత్ర ఎమ్మెల్సీ పి. రఘువర్మకు అతి తక్కువ ఆస్తులు ఉన్నాయి. రూ.1.84లక్షలు మాత్రమే ఆయన ఆస్తులుగా గుర్తించారు.

మొత్తం ఎమ్మెల్సీల్లో 20 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. 40 మంది డిగ్రీ అంతకంటే ఎక్కువగా చదువుకుంటే.. ఎనిమిది మంది మాత్రం ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు మాత్రమే చదువుకున్న వారిగా లెక్క తేలారు. ఏమైనా.. అత్యంత సంపన్నుడే కాదు.. అతి తక్కువ ఆస్తులు ఉన్న ఎమ్మెల్సీ ఏపీ మండలిలో ఉండటం కాస్తంత ఉపశమనం కలిగించే అంశంగా చెప్పొచ్చు.