ఇలాగైతే టీఆర్ఎస్ గెలిచినట్లే

అధికార పార్టీకి సంబంధించి మునుగోడు నియోజకవర్గంలో గ్రూపుల గోలంతా బయటపడుతోంది. కాంగ్రెస్ ఎంఎల్ఏగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయకపోతే బహుశా టీఆర్ఎస్ లోని గ్రూపులు రోడ్డునపడేవి కావేమో. గ్రూపుల గోలను తట్టుకోలేక చివరకు కేసీయార్ కే ఏమిచేయాలో దిక్కుతోస్తున్నట్లు లేదు. కేసీయార్ నిర్ణయించిన క్యాండిడేట్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని నియోజకవర్గంలోని చాలామంది నేతలు వ్యతిరేకిస్తున్నారు.

అభ్యర్ధి ఎంపిక విషయంలో తనను వ్యతిరేకిస్తున్న వారిని ఎలా దారికి తెచ్చుకోవాలో ఇప్పుడు కేసీయార్ కే అర్ధం కావటంలేదు. ప్రభాకర్ కు టికెట్ ఇవ్వటాన్ని సుమారు 40 మంది ద్వితీయశ్రేణి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళంతా మామూలు కార్యకర్తలు కాదు. కూసుకుంట్లను వ్యతిరేకిస్తున్న వారిలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మార్కెట్ యార్డ్ కమిటీల ఛైర్మన్లు, కొందరు సర్పంచులున్నారు. నిజానికి అభ్యర్ధి ఎవరనే దాంతో సంబంధం లేకుండా పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ద్వితీయ స్థాయి నేతలపైనే ఎక్కువగా ఉంటుంది.

అలాంటి నేతలే స్వయంగా కేసీయార్ చెప్పినా వినకపోతే రేపు పార్టీ ఎలా గెలుస్తుందనేది పెద్ద ప్రశ్న. ముందు మంత్రి జగదీశ్వరరెడ్డి చెప్పినా వినకపోతే మంత్రే కేసీయార్ దగ్గరకు వీళ్ళని తీసుకెళ్ళారు. అక్కడ సీఎం చెప్పినా వినలేదు. చివరకు ఎవరిని అభ్యర్ధిగా ఎంపిక చేసినా పార్టీ గెలుపుకు పనిచేయాల్సిందే అని చెప్పి కేసీయార్ భేటీని ముగించారు. అయితే శుక్రవారం ఉదయం వీళ్ళంతా చౌటుప్పల్లో మీటింగ్ పెట్టుకుని కూసుకుంట్లను వ్యతిరేకిస్తు తీర్మానం చేసి దాన్ని కేసీయార్ కు పంపారు.

తాను ఫైనల్ చేసిన అభ్యర్ధిని కూడా నేతలు ఇంతలా వ్యతిరేకిస్తారని కేసీయార్ ఊహించుండరు. అందుకనే అభ్యర్ధి ఎంపికను తనిష్టం వచ్చినట్లు చేశారు. అయితే ఆ విషయం నేతలతో సమావేశం జరిపినపుడు చెబితే సరిపోతుందని అనుకున్నారు. కానీ ముందుగానే అందరుకలిసి తన నిర్ణయాన్ని వ్యతిరేకించబోతున్నట్లు కేసీయార్ కు అసలు సమాచారమే లేదు. దాంతో అభ్యర్ధి విషయంలో ఇపుడేం చేయాలో కేసీయార్ కు తోచటంలేదు. పార్టీలో జరుగుతున్న గొడవలు చూసిన తర్వాత టీఆర్ఎస్ గెలుపుపై అనుమానాలు పెరిగిపోతున్నాయి.