కాళేశ్వరం పంప్ హౌస్ కు భారీ నష్టం

ఈమధ్యనే కురిసిన భారీ వర్షాలు, వరద కారణంగా కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ కు భారీ నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేశారు.  ప్రాజెక్టులో నుండి నీటిని తోడి పంపటానికి వీలుగా ఏర్పాటుచేసిన పంప్ హౌస్ లోని 17 మోటాటర్లలో ఎనిమిది మోటార్లు దెబ్బతిన్నట్లు నిపుణులు స్పష్టంగా తేల్చారు. ఇందులో కూడా ఆరుమోటార్లను పూర్తిగా మార్చాల్సిందే అని అభిప్రాయపడ్డారు. మరో రెండు మోటార్లు కూడా దెబ్బతిన్నప్పటికీ రిపేర్లు చేయిస్తే బాగుపడతాయని అంచనా వేస్తున్నారు.

మిగిలిన తొమ్మిది మోటార్లకు పెద్ద నష్టం జరగలేదని సమాచారం. దెబ్బతిన్న ఆరుమోటార్ల కారణంగా సుమారు వెయ్యి కోట్లరూపాయల నష్టం జరిగినట్లు ప్రాధమిక అంచనా వేశారు. మోటార్లను పూర్తిగా  పరిశీలించి రిపేర్లు లేదా కొత్తవి అమర్చటం అనే నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వం ఫిన్లాండ్, ఆస్ట్రియా నుండి నిపుణులను పిలిపిస్తోంది. జైంట్ సైజ్ మోటార్లను రిపేర్లుచేసేంత సామర్ధ్యం మనదగ్గర ఇంజనీర్లకు లేదట.

మరి పై రెండుదేశాల నుండి ఇంజనీర్లు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పరిశీలించి తన అభిప్రాయాలు చెబుతారో చూడాల్సిందే. ఇప్పటికైతే మన నిపుణుల అంచనా ప్రకారం వెయ్యికోట్ల రూపాయల నష్టమైతే ఖాయమైంది. భారీవర్షాలు, వరద తగ్గి చాలా రోజులే అయినా బురద పేరుకుపోవటంతో ఇంతకాలం నిపుణులు ఎలాంటి అంచనాలు వేయలేకపోయారు. ఇప్పుడిప్పుడే పంపుహౌస్ లో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్నారు. దాదాపు 500 మంది ఇంజనీర్లు, టెక్నీషియన్లు, మామూలు లేబర్ బురద, శకలాలు తొలగించేపనిలోనే పనిచేస్తున్నారు.

వరదదెబ్బకు పంప్ హౌస్ రూపురేఖలే మారిపోయాయి. పంప్ హౌస్ అంతా చెడిపోయిన మోటార్లు, పడిపోయిన రక్షణగోడలు, విరిగిపోయిన క్రేన్లు, తెగిపోయిన కేబుళ్ళు, చిందరవందరగా చెల్లాచెదురైన సామగ్రితో పంప్ హౌస్ భయంకరంగా ఉంది. వీటన్నింటినీ ఇపుడు నిపుణులు, పనివాళ్ళు ఒక్కక్కటే సరిచేస్తున్నారు. మొత్తంమీద మోటార్లకు వెయ్యికోట్ల రూపాయల నష్టమంటే మామూలు విషయంకాదు.