పార్టీల్లో మునుగోడు చిచ్చు

నల్గొండ జిల్లాలోని మునుగోడు ఉపఎన్నిక వ్యవహారం రెండుపార్టీల్లో బాగా చిచ్చు పెడుతోంది. కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోలరెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామాను స్పీకర్ ఆమోదించటంతో  ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే కేంద్ర ఎన్నికల కమీషన్ ఉపఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తుందనేది సస్పెన్స్ గా మారింది. సరే ఉపఎన్నిక తేదీని పక్కనపెట్టేస్తే అన్నీపార్టీలు రెడీ అవుతున్నాయి.

ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల్లో చిచ్చు మొదలైంది. కాంగ్రెస్ కు రాజీనామాచేసిన రాజగోపాల్ బీజేపీలో చేరి అక్కడినుండి పోటి చేయటం ఖాయమనే అనుకోవాలి. మరి కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు కొత్తగా అభ్యర్ధులను వెతుక్కోవాల్సిందే కదా. అభ్యర్దులను ఎంపిక చేయటంలోనే రెండుపార్టీల్లో కసరత్తులు మొదలుపెట్టాయి. దాంతో ఆశావహుల నుండి పార్టీలకు పెద్ద తలనొప్పులు పెరిగిపోతున్నాయి.

అభ్యర్ధి ఎంపికకోసం కేసీయార్ మొదలుపెట్టిన కసరత్తు పెద్ద తలనొప్పిగా తయారైంది. కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని పోటీచేయించాలని అధినేత దాదాపు నిర్ణయించేశారు. అయితే కూసుకుంట్లను నేతలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమ అభిప్రాయాలను కాదని కేసీయార్ అభ్యర్ధిని ఎంపికచేస్తే తామంతా వ్యతిరేకంచేయటం ఖాయమన్నట్లుగా ఏకంగా కేసీయార్ కే వార్నింగులిస్తున్నారు. కేసీయార్ తరపున మంత్రి జగదీశ్వరరెడ్డి  నేతలతో జరిపిన భేటీలు ఫెయిలయ్యాయి. కూసుకుంట్ల అభ్యర్ధిత్వాన్ని నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మార్కెట్ యార్డు ఛైర్మన్లంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నారు.

ఇదే పద్దతి కాంగ్రెస్ లో కూడా కనబడుతోంది. అభ్యర్ధి ఎంపికపై ఇన్చార్జి ఆధ్వర్యంలో సీనియర్లు ఇప్పటికి రెండుమీటింగులు పెట్టినా ఏమీ తేల్చలేకపోయారు. పల్వాయ్ శ్రవంతి, చెఱుకు సుధాకర్ లాంటి అనేకమంది టికెట్ కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. వీళ్ళల్లో ఎవరికీ ఒకరంటే మరొకరికి పడదు. వీళ్ళల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగిలిన వాళ్ళు గెలుపుకోసం సహకరించేది అనుమానమే. ఈ పరిస్ధితుల్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనేది కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పిగా మారింది. నోటిఫికేష్ వచ్చేంతలోపు ఇంకెన్ని మీటింగులు పెట్టుకుంటారో చూడాల్సిందే.