అక్కడ మాత్రం మోడీకి ఇబ్బందులు తప్పవా?

Modi
Modi

నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయే ఎన్డీయేలో నుండి బయటకు వెళ్ళిపోవటంతో నరేంద్రమోడీకి ఒక్కసారిగా ఇబ్బుందులు మొదలైపోయాయి. లోక్ సభలో బీజేపీ లేదా ఎన్డీయేకి సంపూర్ణ మెజారిటి ఉన్నా రాజ్యసభలో మొదటి నుంచి ఇబ్బందులు పడుతూనే ఉంది. బిల్లులు గట్టెక్కటానికి ఎన్డీయే పెద్దలు నానా అవస్థలు పడుతున్నారు. జేడీయూ ఉన్నపుడే నూరుశాతం మెజారిటీ లేదు. అలాంటిది ఇప్పుడు నితీష్ ఎన్డీయేకి కటీఫ్ చెప్పేసిన తర్వాత ఒక్కసారిగా ఇబ్బందుల్లో పడిపోయింది.

245 మంది సభ్యుల రాజ్యసభలో ప్రస్తుతం ఉన్నది 237 మంది మాత్రమే. ఇపుడున్న ఎంపీల సంఖ్యను తీసుకుంటే బిల్లు పాస్ కావాలంటే మ్యాజిక్ మార్క్ 119. ఇపుడు జేడీయు పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఎన్డీయే బలం 110కి పడిపోయింది. అంటే మరో తొమ్మిది మంది ఎంపీల మద్దతుంటే కానీ ఏ బిల్లునూ ఎన్డీయే పాస్ చేయించుకోలేదు. మరపుడు ఏమిచేయాలి ? నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలపైన ఆధారపడక తప్పదు. అంటే బీజేడీ, వైసీపీ, టీఆర్ఎస్ లాంటి పార్టీలన్నమాట.

ఈ నేపధ్యంలోనే  జగన్మోహన్ రెడ్డికి ప్రాధాన్యత పెరుగుతుందా అనే చర్చ మొదలైంది. ఇపుడు అవసరానికి ఎన్డీయేకి జగన్ మద్దతిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కేంద్రానికి జగన్ మద్దతిస్తున్నా రాష్ట్ర ప్రయోజనాలను మాత్రం కేంద్ర ప్రభుత్వం అంతగా పట్టించుకోవటంలేదు. ఇపుడు మారిన పరిస్దితుల్లో ఏపీ ప్రయోజనాల విషయంలో జగన్ గట్టిగా పట్టుబడితే రాజ్యసభలో మద్దతును దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోడీ ఏమైనా సానుకూలమయ్యే అవకాశముంది.

ఏదేమైనా ఎన్డీయేలో  లోక్ సభలో సంపూర్ణ మెజారిటీ ఉంది. రాష్ట్రాలను కూడా బీజేపీ కబళించేస్తోంది. అయినా రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ ఎన్డీయేకి అందని ద్రాక్ష పండు లాగా తయారవుతోంది. నాలుగు రోజులు మెజారిటి ఉందని అనుకోగానే వెంటనే మైనారిటీలోకి పడిపోతోంది. కాకపోతే మోడీ అదృష్టం ఏమిటంటే యూపీఏ పరిస్ధితి ఇంతకన్నా ఘోరంగా ఉందికాబట్టే  ఏదోలా తటస్థుల మద్దతుతో బిల్లులను ఎన్డీయే గట్టెక్కించగలుగుతోంది.