టీడీపీకి షాక్.. గంజి చిరంజీవి రాజీనామా!

రాష్ట్రమంతా తెలిసిన పేరు అని చెప్పలేం కానీ.. ఉమ్మడి గుంటూరు.. క్రిష్ణా జిల్లాల్లో సుపరిచిత నేతగా అందరికి తెలుసు గంజి చిరంజీవి. తాజాగా ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వైనం షాకింగ్ గా మారింది. దీంతో గుంటూరు జిల్లాలో పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందన్న మాట వినిపిస్తోంది. బీసీ వర్గానికి చెందిన ఈ నేత.. ఇన్నాళ్లు తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు అని చెబుతూ.. టీడీపీ అధికార ప్రతినిధి పదవికి.. పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.

బీసీగా ఉన్న తనను పార్టీలో ఇబ్బంది పెట్టారని.. రాజకీయంగా తనను తొక్కేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అతను ఓటమిపాలయ్యారు. దీనికి కారణం పార్టీలోని సొంతనేతలే అంటూ ఆరోపించిన అతను.. పదవుల కోసం.. పరపతి కోసం తాను పార్టీకి రాజీనామా చేయటం లేదన్నారు. 2019లో మంగళగిరి సీటు చిరంజీవిదేనని చెప్పినా.. లోకేశ్ రంగంలోకి దిగటం.. ఆయనే స్వయంగా పోటీ చేయటంతో ఆయనకు అవకాశం లభించలేదు.

వచ్చే దఫా కూడా మంగళగిరి నుంచే లోకేశ్ పోటీ చేస్తారన్న విషయంలో క్లారిటీ వచ్చేయటం.. ఆయనకు ఎలాంటి ప్రత్యామ్నాయం లేకపోవటంతో పార్టీ నుంచి బయటకు రావటానికి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. టీడీపీకి రాజీనామా చేసిన చిరంజీవి.. ఏ పార్టీలో చేరాలన్నది తాను నిర్ణయించుకోలేదన్నారు. రాజీనామా చేసిన సందర్భంలో అతగాడి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారే వీలుందని చెబుతున్నారు.

సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేకనే తాను పార్టీకి గుడ్ బై చెప్పినట్లు పేర్కొనటం గమనార్హం. ‘చివరి నిమిషం వరకు మంగళగిరి ఎమ్మెల్యే సీటు నాదే అని చెప్పి మోసం చేశారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చి మంగళగిరి ప్రజలకు నన్ను దూరం చేశారు. చేనేత వర్గానికి చెందిన నన్ను అణగదొక్కారు. నా ఆవేదన.. బాధ నాయకులకు తెలిసినా నన్ను పట్టించుకోలేదు. ఎస్సీ.. ఎస్టీ.. బీసీలకు న్యాయం చేసే వారితో నడుస్తా’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గంజి చిరంజీవి రాజీనామాకు లోకేశ్ కారణంగా భావిస్తున్నారు.