చైనాకు ఊహించని షాక్ ఇవ్వనున్న మోడీ?

తొందరలోనే డ్రాగన్ కు షాకివ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఈసారి ఇవ్వాలని అనుకుంటున్న షాక్ బడ్జెట్ మొబైల్ కంపెనీల విషయంలో అని సమాచారం. రు. 12 వేల లోపు ఖరీదున్న స్మార్ట్ మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో చైనా కంపెనీలదే హవా. షావోమీ, వోప్పో, రెడ్ మీ కంపెనీలన్నీ చైనావన్న విషయం అందరికీ తెలిసిందే. దేశంలో 12 వేల రూపాయల్లోపు ఖరీదు చేసే మొబైల్ ఫోన్ల అమ్మకాల్లో పై కంపెనీలదే సుమారు 80 శాతం మార్కెట్ ఉందంటే ఎవరు నమ్మరు.

ఒకపుడు ఇండియా కంపెనీలైన లావా, మైక్రోమ్యాక్స్ కంపెనీల మొబైల్ ఫోన్ల బిజినెస్ బాగానే ఉండేది. ఎప్పుడైతే చైనా కంపెనీలు మనదేశంలోకి ఎంటరయ్యాయో అప్పటినుండే ఇండియన్ కంపెనీలు పడకేయటం మొదలుపెట్టాయి. చివరకు దేశంలోని మొబైల్ వ్యాపారాన్ని చైనా కంపెనీలు కమ్ముకునేయటంతో వేరేదారిలేక ఇండియా కంపెనీలు మూతపడిపోయాయి. ఈ విషయాలన్నింటినీ గమనించిన కేంద్ర ప్రభుత్వం స్వదేశీ కంపెనీలకు ప్రోత్సహం ఇచ్చే ఉద్దేశ్యంతో చైనా కంపెనీలపై బ్యాన్ విధించాలని ఆలోచిస్తున్నది.

ఒకవేళ కేంద్రం గనుక చైనా కంపెనీలపై బ్యాన్ విధిస్తే షావోమీ, రెడ్ మీ, ఒప్పో కంపెనీలు దాదాపు మూసేసుకోవాల్సిందే. రు. 12 వేలకు పైగా ధరలున్న మొబైల్ ఫోన్లను మాత్రమే ఇండియాలో అమ్ముకోవచ్చు. ఇప్పటికే ఇండియాలో ఖరీదైన ఫోన్లు అమ్ముతున్న ఆపిల్, వన్ ప్లస్, శాంసంగ్, లాంటి ఫోన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వన్ ప్లస్ కూడా చైనా కంపెనీయే అయినప్పటకి ఈ కంపెనీ నుండి బడ్జెట్ ఫోన్లులేవు అన్నీ ఖరీదైన ఫోన్లే.

ఇప్పటికే చైనాకు చెందిన రకరకాల 300 యాప్స్ ను కేంద్రం బ్యాన్ చేసింది. దీనివల్ల డ్రాగన్ కు ఆదాయం బాగా తగ్గిపోయింది. ఇపుడు మొబైల్ ఫోన్ల కంపెనీలను కూడా నిషేధిస్తే మరింత దెబ్బపడటం ఖాయం. ఇప్పటికే రెండు చైనా కంపెనీలు పెద్ద ఎత్తున ఆదాయంపై పన్నులు కట్టకుండా చైనాకు తరలిస్తున్నట్లు నిర్ధారణైంది. ఇపుడు ఏకంగా కంపెనీలనే బ్యాన్ చేస్తే కనీసం స్వదేశీ కంపెనీలకు కాస్త ప్రోత్సాహమిచ్చినట్లవుతుంది.