వైసీపీ మాకు శాశ్వ‌తం కాదు.. : వైసీపీ ఎమ్మెల్యే

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి రాష్ట్రంలో ఒక‌వైపు.. తీవ్ర‌స్థాయిలో పొలిటిక‌ల్ సెగ రాజుకుంది. అధికార పార్టీలో కీల‌క నాయ‌కులు.. ప‌క్క చూపులు చూస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా..వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్కుతుందో లేదో.. అనే భావ‌న ఉన్న‌వారు.. ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో వైసీపీలో రాజ‌కీయాలు మ‌రింత వేడిగా మారాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు.. మ‌రింత మంట‌పుట్టిస్తున్నాయి.

కాపు సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న‌.. మ‌రో మాట‌లో చెప్పాలంటే.. కాపుల‌కు కంచుకోట వంటి.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లాలోని జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గం వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సంచ‌ల‌న కామెంట్లు  చేశారు. ఎవ‌రు ఏ పార్టీకి శాస్వ‌త‌మో ఎవ‌రికి తెలుసున‌ని అన్నారు. అంతేకాదు.. ఎవ‌రైనా.. పార్టీలు మారే అవ‌కాశం ఉంద‌ని.. చెప్పారు.

తాజాగా నూత‌నంగా సామాజిక పింఛ‌న్‌కు ల‌బ్దిదారులైన వారికి.. ఆయ‌న పింఛ‌న్లు అంద‌జేశారు. అనంత రం.. నిర్వ‌హించిన స‌భ‌లో చంటిబాబు మాట్లాడారు. “రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏదైనా జ‌ర‌గొచ్చు. ఎవ‌రికి ఏ పార్టీ కూడా శాశ్వ‌తం కాదు. రేపు నేనైనా వేరే పార్టీలో చేర‌తానేమో. వేరే జెండాపై పోటీ చేస్తానేమో.. ఎవ‌రు చూడొచ్చారు. అందుకే నాయ‌కుల‌తో గొడ‌వ‌లు వ‌ద్దు“ అని వ్యాఖ్యానించారు.

ఇక‌,ఈ వ్యాఖ్య‌లు సామాజిక మాధ్య‌మాల్లో తీవ్ర‌స్థాయిలో వైర‌ల్ అవుతున్నాయి. ఇదిలావుంటే.. గ‌త ఎన్నిక‌ల్లో చంటిబాబు.. వైసీపీ ప‌క్షాన పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ప్ర‌స్తుతం టీడీపీలో ఉన్న జ్యోతుల నెహ్రూ.. స్వ‌యానా చంటిబాబుకు బాబాయి కావ‌డం గ‌మ‌నార్హం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌న‌సేన బ‌ల‌ప‌డే సూచ‌న‌లు ఉన్నాయ‌ని.. కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతోంది. ఈ క్ర‌మంలోనే చంటిబాబు.. “ముందుచూపుతో“ ఈ వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. మ‌రి దీనిపై వైసీపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.