కరోనా రోగికి 4 గంటలపాటు అంగస్తంభన…డాక్టర్లకు షాక్

మహమ్మారి వైరస్ ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోన్న సంగతి తెలిసిందే. తీవ్రమైన జ్వరం, విపరీతమైన పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు…ఇవి కరోనా సోకిన వారిలో కనిపించే ప్రధాన లక్షణాలు. వీటితో పాటు అసలు ఏ లక్షణాలు లేకుండా కూడా కరోనా బారిన పడ్డవారూ ఉన్నారు. ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపే ఈ ప్రాణాంతక వైరస్….శ్వాస సంబంధిత రోగాలతో బాధపడే వారిని తీవ్రంగా ఇబ్బందిపెడుతుంది. ఈ నేపథ్యంలో పారిస్ లో ఓ కరోనా పాజిటివ్ రోగిలో ఓ వింత లక్షణాన్ని వైద్యులు గుర్తించారు. కరోనా బారిన పడ్డ 62 ఏళ్ల రోగి పురుషాంగం నాలుగు గంటలపాటు స్తంభించి ఉండడంతో డాక్టర్లు అవాక్కయ్యారు. కరోనా సోకడం వల్ల ఆ రోగి శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరగలేదని, పురుషాంగంలో రక్తం సరఫరాలో అంతరాయం వల్ల అంగం అంతసేపు స్తంభించిందని వారు గుర్తించారు. ఈ రకమైన పరిస్థితిని ప్రియాపిజమ్ అంటారని, గతంలో ఆ రోగికి అ అటువంటిది ఎపుడూ జరగలేదని వైద్యులు గుర్తించారు.

ఆ రోగి రక్త నమూనాలను పరీక్షించిన వైద్యులు….నలుపు రంగులో రక్తం గట్టి ఉండడాన్ని గుర్తించారు. ఆ రోగి శరీరంలో అధికశాతంలో కార్బన్ డయాక్సైడ్, తక్కువ శాతంలో ఆక్సిజన్ శాతాలున్నాయని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరేటపుడు ఆ రోగి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడని…14 రోజుల పాటు వెంటిలేటర్ పై చికిత్స అందించిన తర్వాత వెంటిలేటర్ తొలగించామని తెలిపారు. అయితే, ఏప్రిల్ నెలలోనూ ఈ రకంగా కొందరు కరోనా పాజిటివ్ రోగుల్లో రక్తం గడ్డకట్టిన దాఖలాలున్నాయని, కానీ, ఈ రోగి మాదిరిగా ప్రియాపిజమ్ లక్షణాలు లేవని తెలిపారు. రక్తం గడ్డ కట్టడం వల్ల ఊపిరితిత్తులకు రక్తప్రసరణ సరిగా జరగదని, అటువంటి సందర్భంలో రోగిలో శ్వాసపరమైన ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు. కరోనా పాజిటివ్ రోగుల్లో ఈ స్థితి ఎందుకు వస్తుందన్న దానిపై మరింత పరిశోధనలు జరగాల్సి ఉందని చెప్పారు.