సీమ‌లో భేష్‌.. కోస్తాలో డ‌ల్‌.. తాజా రిపోర్ట్‌..!

ఏపీ అధికార పార్టీ వైసీపీ ఎక్క‌డైతే పుంజుకుందామ‌ని..ఎక్క‌డైతే పుంజుకోవాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుందో.. అక్క‌డ మాత్రం పుంజుకోలేకపోతోంది. గ‌తంలో ఎక్క‌డ బ‌లం ఉందో.. అక్కడ మాత్రం అలానే ఉంది. ఇదీ.. ఇప్పుడు తాజాగా వైసీపీకి అందిన రిపోర్టు. ప్ర‌స్తుతం.. పార్టీ నిర్వ‌హిస్తున్న గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా సాగాల‌ని.. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ కోరుకున్నారు. ఇది ప్ర‌జ‌ల్లో మంచి జోష్ నింపుతుంద‌ని కూడా అనుకున్నారు.

ఆయ‌న అనుకున్న‌ది బాగానే ఉన్నా.. చాలా ప్రాంతాల్లో నాయ‌కులు ముందుకు రావ‌డం లేదు. ప్ర‌జ‌ల నుంచి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని భావిస్తున్నారో.. లేక .. ఏం చేశామ‌ని.. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లాల‌ని.. త‌ల‌పోస్తున్నారో.. తెలియ‌దు కానీ.. పార్టీలోని స‌గానికిపైగా.. ఎమ్మెల్యేలు.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే.. ఇదే స‌మ‌యంలో సీమ‌లో మాత్రం ఫుల్లుగా.. ఎమ్మెల్యేలు కదులుతున్నారు. ఓ ఐదారుగురు త‌ప్ప‌.. మిగిలిన వారంతా కూడా.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో తిరుగుతున్నారు.

సీమ‌లోని క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు ఉమ్మడి జిల్లాల్లో నాయ‌కులు.. మంత్రులు.. మాజీ మంత్రులు ప్ర‌జ‌ల‌తోమ‌మేకం అవుతున్నారు. కొంద‌రు తిట్లు తిన్నా ఫ‌ర్వాలేదు.. అన్న‌ట్టుగానే.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నారు. దీంతో సీమ‌లో వైసీపీకి జోష్ క‌నిపిస్తోంది. సీమ‌లో అస‌లు ప్ర‌తిప‌క్షాలు వైసీపీ ముందు నిల‌బ‌డే ప‌రిస్థితి కూడా లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇదే రిపోర్ట్ క‌న‌డ‌ప‌తుంద‌న్న అంచ‌నాలు కూడా ఉన్నాయి.

అయితే.. అదే స‌మ‌యంలో కోస్తాలోని చాలా జిల్లాల్లో ఈ కార్య‌క్ర‌మం ఇంకా ప్రారంభం కాలేదు. ఉమ్మ‌డి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అయితే.. స‌గం నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా.. గ‌డ‌ప‌గ‌డ‌ప కార్య‌క్ర‌మం మొద‌లే కాలేదు. అస‌లు వాస్త‌వానికి.. టీడీపీ అయినా.. జ‌న‌సేన అయినా.. పుంజుకునేది.. కోస్తాలోనే అనే భావ‌న వైసీపీలో ఉంది. ఇలాంటి స‌మ‌యంలో ఈ జిల్లాల్లో పార్టీ బ‌ల‌ప‌డాలంటే.. ఖ‌చ్చితంగా.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌నేది.. వైసీపీ వ్యూహం.

కానీ, అలా అయితే లేదు. దీంతో.. ఇప్పుడు పార్టీ ఏం చేయాల‌నేది అధినేత‌కు వ‌దిలేసిన‌ట్టు తెలిసింది. ఈ రోజు లేదా.. రేప‌టిలో మ‌రోసారి గ‌డ‌ప గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంపై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష చేసి.. నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేయ‌నున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి.