రెండు వారాల్లో యుద్ధ‌మే: కోమ‌టిరెడ్డి డెడ్‌లైన్‌

10-15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి డెడ్‌లైన్ విధించారు. మునుగో డు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ భావిస్తే ఉప ఎన్నిక రాదని.. ప్రజలు సిద్ధంగా ఉంటే వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీని వీడనున్నారనే వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌ వేర్వేరుగా జూబ్లీహిల్స్‌లోని నివాసంలో రాజగోపాల్ రెడ్డితో భేటీ అయి బుజ్జగించేందుకు ప్రయత్నించారు. ఉత్తమ్‌, వంశీచంద్‌తో భేటీ అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.

మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలని రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ భావిస్తే ఉప ఎన్నిక రాదని.. ప్రజలు సిద్ధంగా ఉంటేనే వస్తుందని వ్యాఖ్యానించారు. రాబోయే 15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తామన్నారు. ఇది పార్టీల మధ్య యుద్ధం కాదని.. కేసీఆర్ కుటుంబానికి, ప్రజలకు మధ్య జరిగే యుద్ధమని అభివర్ణించారు.

అభివృద్ధిని కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కే పరిమితం చేశారన్న రాజగోపాల్రెడ్డి.. కేసీఆర్కు బుద్ధి చెప్పే ఎన్నిక వస్తుందన్నారు. 10-15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తానన్నారు. ఈ క్రమంలోనే తన రాజీనామా గురించి అమిత్ షాతో మాట్లాడలేదని రాజగోపాల్రెడ్డి స్పష్టం చేశారు.

‘‘మునుగోడు తీర్పు తెలంగాణ మార్పునకు నాంది కావాలి. కేసీఆర్‌ భావిస్తే ఉపఎన్నిక రాదు. ప్రజలు సిద్ధంగా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక వస్తుంది. రాబోయే రోజుల్లో యుద్ధం ప్రకటిస్తాం. ఇది పార్టీల మధ్య యుద్ధం కాదు. కేసీఆర్‌ కుటుంబానికి, ప్రజలకు మధ్య జరిగే యుద్ధం. 10-15 రోజుల్లో యుద్ధం ప్రకటిస్తా.’’ అని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మరోవైపు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరే అంశంపై మునుగోడు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మూడు రోజుల పాటు భేటీ నిర్వహించిన రాజగోపాల్‌రెడ్డి… వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ మార్పు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎదురయ్యే ఉప ఎన్నిక.. పరిణామాలు, నియోజకవర్గంలో పార్టీల పరిస్థితులపై ఆయన చర్చించారు.

రాజగోపాల్‌రెడ్డి విషయమై ఆయన సోదరుడు ఢిల్లీలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో.. ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశమై.. గంటన్నరకు పైగా చర్చించారు. ఎంపీ వెంకట్‌రెడ్డి సైతం రాజగోపాల్‌రెడ్డి తీరుపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆయన కాంగ్రెస్‌లో కొనసాగేలా చూసేందుకు ప్రయత్నిస్తానని వెంకట్‌రెడ్డి చెప్పినట్లు సమాచారం.