ఒక్క మాట‌.. కాంగ్రెస్‌ను కింద‌కు దించేసిందిగా!

ఔను.. ఒకే ఒక్క మాట‌.. కాంగ్రెస్‌ను పూర్తిగా డోలాయ‌మానంలోకి ప‌డేసింది. కింద‌కు దించేసింది. నిన్నటి వ‌ర‌కు కేంద్రంపై విరుచుకుప‌డిన గొంతుల‌ను సైలెంట్ చేసేసింది. అదే.. రాష్ట్ర‌ప‌తి కాదు.. రాష్ట్ర‌ప‌త్ని! ఇది.. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రి చేసిన వ్యాఖ్య‌. దీనిపై ఉభ‌య స‌భ‌ల్లోనూ ర‌చ్చ రంబోలా అయిపోయింది.

ధరల పెరుగుదల, ఎంపీల సస్పెన్షన్పై కేంద్రంపై ముప్పేట దాడికి విపక్షాలు ప్రయత్నిస్తున్న వేళ.. ఒక్క సారిగా సీన్ రివర్స్ అయింది. కొద్ది రోజులుగా చేస్తున్న ఆందోళనలు.. మరుగున పడిపోయాయి. బదులుగా ఇప్పుడు బీజేపీ ఎంపీలే నిరసన బాట పట్టారు. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ వ్యాఖ్యలపై.. రాష్ట్రపతికి, దేశానికి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోనియా లోక్సభలో తమ ఎంపీలను, ప్రత్యేకించి ఒకరిని(స్మృతి ఇరానీని) బెదిరించారని నిర్మల ఆరోపించగా.. రెండు వర్గాల మధ్య పెద్ద రాద్ధాంతమే జరిగింది.

మరో వైపు.. తనను ఉరి తీయాలనుకున్నా దానికి సిద్ధమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు అధీర్. ధరల పెరుగుదల వంటి పలు అంశాలపై అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని చూసిన కాంగ్రెస్ సహా విపక్షాలకు అధీర్ రంజన్ చౌదరి రూపంలో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. అధీర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన బీజేపీ.. నేరుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పైనే గురిపెట్టింది. రాష్ట్రపతికి, దేశానికి ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనని కమలదళం పట్టుబడుతోంది.

అధీర్ రంజన్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు, అధికార పక్షం నిరసనల నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సోనియా గాంధీ ప్రయత్నించారు. లోక్సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడగానే సోనియా గాంధీ.. ట్రెజరీ బెంచ్ వద్దకు వెళ్లారు. ఈ అంశంలోకి తనను ఎందుకు లాగుతున్నారని అక్కడ ఉన్న బీజేపీ నేత రమాదేవిని అడిగారు.

ఈ సమయంలో స్మృతి ఇరానీ.. మధ్యలో కలగజేసుకున్నారు. సోనియా గాంధీని చూపిస్తూ అధీర్ వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేశారు. తొలుత స్మృతి ఇరానీని.. సోనియా పట్టించుకోలేదు. అయితే, కాసేపటికే మంత్రివైపు చూసి కోపంగా మాట్లాడారు. ఈ విషయంపై స్పందించిన రమాదేవి.. “‘నా పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారు? నా తప్పు ఏంటి?’ అని సోనియా నన్ను అడిగారు. ‘కాంగ్రెస్ లోక్సభాపక్షనేతగా చౌదరిని ఎంపిక చేయడమే మీరు చేసిన తప్పు’ అని నేను సోనియాతో చెప్పా” అని మీడియాకు వివరించారు. అయితే, సోనియా గాంధీ లోక్సభలో కొందరు బీజేపీ ఎంపీలను బెదిరించారని సంచలన ఆరోపించారు కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్. మొత్తానికి ఈ వివాదం ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.