జనం లేని.. జ‌గ‌న‌న్న ప‌ర్య‌ట‌న‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్ గురించి ఆయ‌న పార్టీ వైసీపీనాయ‌కులు చాలా గొప్ప‌గా చెబుతారు. జ‌గ‌న్ ఎక్క‌డ అడుగు పెట్టినా.. భారీ సంఖ్య‌లో జ‌నాలు వ‌స్తార‌ని.. ఇసుక వేసినప్ప‌టికీ రాల‌ద‌ని.. చాలా చాలా వ‌ర్ణిస్తారు. అయితే .. ఇది ఎన్నిక‌ల‌కు ముందు. ఇప్పుడు సీఎం అయ్యాక మాత్రం ఎక్క‌డా అలాంటి జోష్‌ క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల చాలా చోట్ల జ‌గ‌న్ నిర్వ‌హించిన స‌భ‌ల‌కు డ్వాక్రా మ‌హిళా సంఘాలను త‌ర‌లించాల్సి వ‌చ్చింది. ఎందుకంటే.. ఆయా ప్రాంతాల్లో నాయ‌కులు చాలా క‌ష్టప‌డి ప్ర‌జ‌ల‌ను తీసుకువ‌చ్చినా.. స‌భ‌లో కూర్చోలేదు.

సీఎం జ‌గ‌న్ ప్ర‌సంగం ప్రారంభించ‌గానో.. మ‌ధ్య‌లోనే కుర్చీల‌న్నీ ఖాళీ అయ్యాయి. దీంతో డ్వాక్రా మ‌హిళ‌ల‌ను ఆయా స‌భ‌ల‌కు త‌ర‌లించారు. ఇక‌, తాజాగా ఇప్పుడు గోదావ‌రి వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్న జ‌గ‌న్‌కు మ‌ళ్లీ అదేస‌మ‌స్య ఎదురైంది.. ఎక్క‌డా కూడా ఆయ‌న‌ను ప్ర‌జ‌లు ప‌ట్టించుకున్న ప‌రిస్థితి లేదు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో వరద ప్రాంతాల్లో సీఎం జగన్మోహన్‌ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన పంటుపై లంక గ్రామాల్లోకి వెళ్ళారు.

తొలుత పి.గన్నవరం మండలం జి. పెదపూడి గ్రామానికి చేరుకున్నారు. వరద బాధితులను పరామర్శించారు. అక్కడి నుంచి పుచ్చకాయలవారిపేటలో వరద బాధితులతో సమావేశమవుతారు. బాధితులతో సీఎం జగన్‌ నేరుగా మాట్లాడనున్నారు. ఆ తర్వాత అరిగెలవారిపేట చేరుకుని అక్కడ బాధితులను కలుస్తారు. ఆయన ఇవాళ ఉడిమూడిలంక చేరుకుని అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు.

అలాగే మధ్యాహ్నం 2.05 గంటలకు పి.గన్నవరం మండలం వాడ్రేవుపల్లి చేరుకుని అక్కడ వరద బాధుతులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి రాజోలు మండలం మేకలపాలెం పర్యటించిన తరవాత సాయంత్రం 4.05 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. అయితే.. జ‌గ‌న్ ఎక్క‌డికి వెఎళ్లినా.. కేవ‌లం ప‌ది మంది పార్టీ స్థానిక నాయ‌కులు.. ఇద్ద‌రు ముగ్గురు మంత్రులు.. భారీ సంఖ్య‌లో పోలీసులు మాత్ర‌మే ద‌ర్శ‌న‌మిస్తున్నారు త‌ప్ప‌.. ప్ర‌జ‌లు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కొస‌మెరుపు:

జ‌గ‌న్ త‌న ప‌ర్య‌ట‌న‌లో ఎప్పుడూ మీడియాకు స్కోపు ఇస్తారు. అయితే.. ఇటీవ‌ల కాలంలో ఆయ‌న మాట్లాడుతున్న మాట‌లు వివాదం అవుతుండ‌డంతో ఈ ద‌ఫా ప్రైవేటు మీడియాను అనుమ‌తించ‌లేదు. కేవ‌లం ఫొటో గ్రాఫ‌ర్లు, ప్రింట్ మీడియా రిపోర్ట‌ర్ల‌ను మాత్ర‌మే అనుమ‌తించారు. ప్ర‌భుత్వ మీడియాను వెంట తీసుకువెళ్లారు.