ఏందీ రచ్చ నాని గారు?

విజయవాడ ఎంపీ కేశినేని నాని మాటలు, పోస్టులు తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, 2024 ఎన్నికల తర్వాత టీడీపీని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చీల్చేస్తారంటు ఎంపీ మీడియాతో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒకవైపు పార్టీలో ఎంపీ వ్యాఖ్యలపై చర్చలు జరుగుతుండగానే తాజాగా తన ఫెస్ బుక్ వాల్ పై మరో పోస్టు పెట్టారు. ‘యధార్ధవాది లోకవిరోధి’ అని తన పోస్టును ప్రారంభించారు.

తాను బీజేపీలోకి వెళతానని కొద్దిరోజులు, కాదు కాదు వైసీపీలోకి మారబోతున్నట్లు మరికొన్ని రోజులు తమ పార్టీ నేతలే ప్రచారం చేస్తున్నట్లు మండిపడ్డారు. పార్టీ హితవు కోరి, బలోపేతం అవటానికి తాను చంద్రబాబునాయుడుకు సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. తానిచ్చే సూచనలు వినటానికి కాస్త కటువుగా ఉన్నా అవి వాస్తవాలే అన్నారు. అయితే అధినేతను కొందరు నేతలు తప్పుదోవ పట్టిస్తు పార్టీలో తమ పబ్బం గడుపుకుంటున్నట్లు మండిపడ్డారు.

తనవల్ల పార్టీకి మంచి జరిగితే చంద్రబాబు కోటరీగా ఏర్పడ్డ నేతల వల్ల పార్టీకి చెడు జరుగుతోందన్నారు. వ్యక్తిగతంగా తనపై బురద చల్లటం మానేసి తాను చెప్పిన అంశాలను మాత్రమే ఆలోచించాలన్నారు. పార్టీని పటిష్టం చేయటంపై ఆలోచించి అధినేతకు సూచనలు చేయాలని హితవు పలికారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం ఎలాగ అనే విషయాన్ని చర్చించటం మానేసి తనపై బురద చల్లటం వల్ల పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదని సూటిగా చెప్పారు.

ఏదేమైనా కేశినేని చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. స్వపక్షంలోనే ప్రతిపక్షంగా ఎంపీ తయారయ్యారని ఎంపీని ఉద్దేశించి విజయవాడలోని కొందరు నేతలు మండిపోతున్నారు. బుద్ధా వెంకన్న, బోండా ఉమ, నాగుల్ మీరా లాంటి నేతలతో ఎంపీకి చాలాకాలంగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిని సర్దుబాటు చేయలేక చంద్రబాబునాయుడు కూడా చేతులెత్తేశారు. దాంతో ఈ నేతలంతా ఎవరిగోల వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.