రేవంత్ రెడ్డి ప్లాన్ హిట్టయినట్టే ఉందే !

షెడ్యూల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీలో ఘర్ వాపసీ కార్యక్రమం ఊపందుకుంటోంది. వివిధ కారణాలతో గతంలో కాంగ్రెస్ పార్టీని వదిలేసి ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోయిన నేతలందరినీ తిరిగి కాంగ్రెస్ లోకి రావాలంటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజ్ఞప్తిచేశారు. రేవంత్ విజ్ఞప్తికి స్పందన బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. మెల్లిమెల్లిగా ఇతర పార్టీల్లో ఉన్న నేతలు అంటే ముఖ్యంగా టీఆర్ఎస్ నుండి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారు.

తాజాగా హుస్నాబాద్ మాజీ ఎంఎల్ఏ అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఈమధ్యనే మహబూబ్ నగర్ కు చెందిన ఎర్రసత్యం కూడా పార్టీలో చేరిన విషయం తెలిసిందే. వీరిద్దరు టీఆర్ఎస్, బీజేపీని వదిలేసి మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. వీళ్ళే కాకుండా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నలుగురు మాజీ ఎంఎల్ఏలు, ఒక ఎంఎల్సీ టీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి వచ్చేయటానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాలో ఒక మాజీ ఎంఎల్ఏ, మరో మాజీ ఎంఎల్సీ కూడా తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారట.

కాంగ్రెస్ లో నుండి చాలామంది సీనియర్ నేతలు టీఆర్ఎస్ లో చేరినా వాళ్ళల్లో అత్యధికులు పెద్దగా సంతృప్తిగా లేరు. వివిధ కారణాల వల్ల కేసీయార్ కు వాళ్ళు దగ్గరకాలేకపోయారు. దాంతో టీఆర్ఎస్ నేతలకు పార్టీలో చేరిన వాళ్ళకు మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతునే ఉన్నాయి. పైగా వచ్చే ఎన్నికల్లో పార్టీలో చేరిన వాళ్ళల్లో అత్యధికులకు టికెట్లు దక్కే అవకాశాలు కూడా లేవు. దాంతో వాళ్ళల్లో అసంతృప్తి పెరిగిపోతోంది.

సరిగ్గా ఇలాంటి వాళ్ళపైనే రేవంత్ గురిపెట్టారు. అందుకనే అసంతృప్త నేతలంతా టీఆర్ఎస్ లో నుండి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు రెడీ అయిపోతున్నారు. అయితే ఇలా చేరుతున్న వారిలో చాలామంది విషయంలో కాంగ్రెస్ సీనియర్ నేతల్లో కూడా అసంతృప్తి పెరిగిపోతోంది. మరిలా చేరుతున్న వాళ్ళందరికీ రేవంత్ ఏమి హామీలిస్తున్నారో బయటకు తెలీటంలేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేనపుడు ఎన్నికల సమయంలో వీళ్ళంతా ఎలా రియాక్టవుతారో చూడాలి.