మేమేమ‌న్నా.. డ‌బ్బులు ప్రింట్ చేస్తున్నామా?: బొత్స

ఏపీ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. విదేశీ ఉన్నత విద్య పథకాన్నినిలుపుదల చేశారన్న విపక్షాల విమర్శలను మంత్రి బొత్స ఖండించారు. అమెరికా వెళ్తా అనగానే డబ్బులు ఇచ్చేస్తామా? అని ఆయన ప్రశ్నించారు. మెరిట్ విద్యార్థులకే విదేశీ విద్య ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ విధానమని వెల్లడించారు. “ఎవ‌రో వ‌స్తారు. అమెరికా వెళ్తామంటారు.. డ‌బ్బులు ఇచ్చేస్తామా? ప్ర‌భుత్వం ఏమ‌న్నా.. డ‌బ్బులు ముద్రిస్తోంద‌ని అనుకుంటున్నారా?” అని ఆయ‌న ఫైర‌య్యారు.

విదేశీ ఉన్నత విద్య పథకాన్నినిలుపుదల చేశారన్న విపక్షాల విమర్శలను బొత్స తప్పుపట్టారు. రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాల మూసేశారంటే విద్యాశాఖ మంత్రిగా దానికి బాధ్యత వహిస్తానన్నారు. ఎక్కడా పాఠశాలలు మూసివేయలేదని చెప్పారు. పాఠశాలల్లో తరగతుల విలీనంపై దాదాపు 270 అభ్యంతరాలు వచ్చాయని వాటిని పరిశీలిస్తామని చెప్పారు. 3,4,5 తరగతులను తరలించిన తర్వాత ఆ పాఠశాలల్లో 1,2 తరగతులతో పాటూ ఫౌండేషన్ స్కూల్ తీసుకొస్తామని తెలిపారు.

ఉపాధ్యాయుల వినతులను పరిగణలోకి తీసుకుని జీవో 117కు సవరణ చేశామన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఒక తరగతిలో విద్యార్థుల సంఖ్య 21 దాటితే మరొక ఎస్జీటీ ఉపాధ్యాయుడిని నియమిస్తామని చెప్పారు. ఉన్నత పాఠశాలల్లో 150 మంది విద్యార్థులు సంఖ్య దాటితే ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

మెరిట్ విద్యార్థులకే విదేశీ విద్య ఇవ్వాలన్నది తమ ప్రభుత్వ విధానమని, ఈ ప‌థ‌కాన్ని అంద‌రికీ అమ‌లు చేయ‌లేమ‌ని మంత్రి బొత్స వెల్లడించారు. ఆ మేరకే విదేశీ విద్య చదువుతున్న విద్యార్థుల్లో 100 శాతం ప్రతిభ ఉన్న వారికే 100 శాతం వేతనం ఇస్తామన్నారు. అందులోనూ అత్యుత్తమ ర్యాంకు ఉన్న విశ్వవిద్యాలయాల్లో చదివే వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. మ‌రి బొత్స వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్షాలు ఎల రియాక్ట్ అవుతాయో చూడాలి.