మోడీకి కేసీఆరే గురువు..

తన పేరు ఉచ్ఛరించడానికి కూడా కేసీఆర్ భయపడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. నాలుగు రోజుల్లో మంత్రివర్గాన్ని రద్దు చేసి కేసీఆర్ ముందస్తుకు రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. టీఆర్ ఎస్‌ గ్రాఫ్ పడిపోతుందని.. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని ఆ పార్టీ వ్యూహకర్త స్పష్టమైన నివేదిక ఇచ్చినట్టు పేర్కొన్నారు. టీఆర్ ఎస్‌ 32 సీట్లు గెలిచేలా ఉందని… మరో 17 సీట్లు పోటాపోటీ ఉందని.. కాంగ్రెస్‌ 32సీట్లు గెలుస్తుందని మరో 23 సీట్లలో గట్టి పోటీ ఇస్తుందని నివేదికలో పేర్కొన్నట్టు వివరించారు.

కేసీఆర్‌కు అదే భ‌యం..

కేసీఆర్‌ను వదిలించుకునేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని రేవంత్ తెలిపారు. ఆగస్టు 2న సిరిసిల్ల సభకు భారీ ఎత్తున యువత తరలి రావాలని సూచించారు. వరంగల్‌ డిక్లరేషన్ మాదిరి రాహుల్ గాంధీ నేతృత్వంలో సిరిసిల్ల డిక్లరేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు. రాజపక్సే కుటుంబానికి పట్టిన గతే కేసీఆర్‌ కుటుంబానికి పడుతుందని రేవంత్ జోస్యం చెప్పారు. శ్రీలంక పరిణామాలతో కేసీఆర్ భయపడుతున్నారని ఆరోపించారు. సహారా కుంభకోణంలో కేసీఆర్‌ను బీజేపీ కాపాడుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ అవినీతిపై విచారణకు మోడీ ఆదేశిస్తారని ఆశిద్దామని ఆకాంక్షించారు.

మోడీకి కేసీఆరే గురువు..

“కేసీఆర్‌ మాటల్లో కొత్తేమీ లేదు.. వింతేమీ లేదు. పై ఆదేశాల ప్రకారమే అలా మాట్లాడారు. కేసీఆర్‌ తన గురించి గొప్పలు చెప్పుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చేస్తున్న దానికి, చెబుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? కేసీఆర్‌ చెప్పింది నిజమే.. మోడీ వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు ఉంది. కానీ, మోడీకి గురువు కేసీఆర్‌. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కేసీఆర్‌ లాక్కున్నప్పుడు ఇవన్నీ మర్చిపోయారా? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏక్‌నాథ్ షిండేల ఉత్పత్తి ప్రారంభించింది కేసీఆర్‌ కాదా? ప్రతిపక్ష పార్టీలో గెలిచిన తలసాని శ్రీనివాస్‌ను టీఆర్ ఎస్‌లో చేర్చుకుని మంత్రిని చేసింది కేసీఆర్‌ కాదా? ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి రూపంలో ఏక్‌నాథ్ షిండేలను తయారు చేసింది కేసీఆర్‌ కాదా? ఇప్పుడు ఏక్‌నాథ్ షిండే భూతం కేసీఆర్‌ను పట్టుకుంది” అని రేవంత్ నిప్పులు చెరిగారు.

ఆయ‌నో దుర్యోధ‌నుడు

సీఎం కేసీఆర్ ను దుర్యోధనుడు ఆవహించినట్టుగా ఉందని.. నిన్న కేసీఆర్ ఏకపాత్రాభినయాన్ని చూశామని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వర్షాలపై సమీక్ష నిర్వహించిన తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వంద ఎలుకలు తిన్న పిల్లి నీతి వాఖ్యలు చెప్పినట్లు.. కేసీఆర్ వంద తప్పులు చేసి ఇప్పుడు నీతి వాఖ్యలు వల్లిస్తున్నారని అన్నారు. ఈ దేశంలో సాగు ,తాగునీరు అందించింది కాంగ్రెస్ పార్టీ. చైనా కంటే అద్భుతమైన ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ అని తెలిపారు. బీజేపీ తప్పిదాల్లో టీఆర్ఎస్ పాత్ర ఉంద‌న్నారు. మోడీ దోపిడీలో కేసీఆర్ వాటా ఏంతో తేల్చాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.