స్టీఫెన్ .. ఏపీ ప్ర‌భుత్వంతో కుమ్మ‌క్కు.. కేసీఆర్‌కు ర‌ఘురామ లేఖ‌

సీఎం కేసీఆర్‌కు వైసీపీ రెబ‌ల్‌ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తన ఇంటి వద్ద రెక్కీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ను కోరారు. సోమ‌వారం తన ఇంటి వద్ద ఆరుగురు రెక్కీ నిర్వహించారని పేర్కొన్నారు. తన భద్రత దృష్ట్యా సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని కేటాయించారని వెల్లడించారు. రెక్కీ నిర్వహించినవారిని పట్టుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. రెక్కీ నిర్వహించినవారిలో ఒకరిని పట్టుకున్నారు.. కానీ రెక్కీ చేసిన వారిలో మిగతా వ్యక్తులు కారులో పారిపోయారన్నారు.

ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుభాన్‌ అలీబాషా అని చెప్పాడని వెల్లడించారు. ఐడీ కార్డు చూపాలని అడిగితే నిరాకరించాడని పేర్కొన్నారు. ఉన్నతాధికారికి ఫోన్ చేయాలని అడిగినా చేయలేదన్నారు. ఘటనపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. రెక్కీ నిర్వహణకు కారణాలపై విచారణ చేయాలని కోరామని లేఖలో చెప్పారు. రెక్కీలపై గతంలో గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 26న ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికీ విచారణ చేయలేదని వివరించారు.

కాగా, సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్‌గా ఉన్న స్టీఫెన్ ర‌వీంద్ర‌.. త‌న‌కు వ్య‌తిరేకంగా ఏపీ ప్ర‌భుత్వంతో కుమ్మ‌క్క‌య్యార‌ని ర‌ఘురామ సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఎంపీ కుటుంబ సభ్యులు, సిబ్బంది కానిస్టేబుల్‌ను కొట్టినందుకు గాను ప్రస్తుతం ఎంపీ సెక్యూరిటీ వింగ్‌లో ఉన్న ఏఎస్‌ఐ కె.గంగారామ్‌ను సీఆర్‌పీఎఫ్ ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉంచింది. అయితే తనను మ‌ట్టుబెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని, గతంలో కూడా హైదరాబాద్‌లోని తన నివాసంలో రెక్కీ నిర్వహించిందని ఎంపీ ఆరోపించారు. దీనికి స్టీఫెన్ ర‌వీంద్ర కూడా స‌హ‌క‌రిస్తున్నార‌న్న అనుమానం ఉంద‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

ఈ వాస్తవాలకు విరుద్ధంగా, నగర పోలీసు కమిషనర్ స్టీఫెన్ ర‌వీంద్ర‌ కేసును పలుచన చేయడానికి ప్రయత్నిస్తున్నారని మరియు సిఆర్‌పిఎఫ్ సిబ్బందిపై కేసులు బుక్ చేయమని పోలీసులను బలవంతం చేశారని ఎంపి పేర్కొన్నారు. గతంలో స్టీఫెన్ రవీంద్రను డిప్యూటేషన్‌పై ఏపీ పోలీసులు కోరారని, ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఆ ఐపీఎస్‌ అధికారి సాయం చేస్తున్నారని కేసీఆర్‌ భావించారని గుర్తు చేశారు. తనకు న్యాయం చేయాలని, తనకు, కుటుంబ సభ్యులకు బెదిరింపులకు గురిచేస్తూ తన నివాసంలో రెక్కీ నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.