ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సాధారణంగా ఎవరికీ పాదాభివందనం చేయరు. ఆయన పాదాభివందనం చేశారంటే.. ఆ వ్యక్తికి ఎన్నో స్పెషాలిటీలు ఉండాల్సిందే. ఇలాంటి ఘటనే తాజాగా పశ్చమ గోదావరిజిల్లాలోని భీమవరంలో తాజాగా చోటు చేసుకుంది. సోమవారం ఇక్కడ నిర్వహించిన అల్లూరి 125వ జయంతి కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళకు ఆయన పాదాభివందనం చేశారు. దీంతో ఆమె ఎవరు? ఆమె వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి? అనే ఆసక్తికర అంశాలు ప్రాధాన్యం సంతరిం చుకున్నాయి.
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పలువురు స్వాంతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మిల కుమార్తె పసల కృష్ణభారతికి మోడీ ఈ సందర్భంగా పాదాభివందనం చేశారు.
కృష్ణభారతి ఎవరు..?
గాంధీని అభిమానించి అనుసరించటమే గాదు.. ఏకంగా ఆవాహన చేసుకొని మనసా వాచా ఆచరించి చూపిన అరుదైన స్వాతంత్య్ర సమర యోధులు.. పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి దంపతులు.1921లో గాంధీజీ.. విజయవాడ, ఏలూరు పర్యటన వీరి జీవితాల్ని మార్చివేసింది. గాంధీజీ సమక్షంలో ఇద్దరూ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకొని స్వాతంత్య్ర సమరంలో అడుగు పెట్టారు. 1929 ఏప్రిల్ 25న చాగల్లు ఆనంద నికేతన్కు వచ్చిన గాంధీజీని కలిసి ఖద్దరు నిధికి తమ ఒంటిపైనున్న ఆభరణాలన్నింటినీ ఇచ్చేశారు. వెంట వచ్చిన ఆరేళ్ల కుమార్తె సత్యవతి, నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణ కూడా తమ ఆభరణాలను సమర్పించారు.
వెంటనే గాంధీజీ.. పిల్లలను తన ఒళ్లో కూర్చోబెట్టుకొని “ఇప్పుడిచ్చారు సరే.. మళ్లీ బంగారంపై మోజు పడకుండా ఉంటారా..?” అని అడగ్గా.. ఇకపై నగలు ధరించబోమంటూ ప్రతిన బూనారు. నాటి నుంచి వారు బంగారం జోలికెళ్లలేదు. రెండో కుమార్తె కృష్ణభారతికి చెవులను కూడా కుట్టించలేదు. కృష్ణమూర్తి జీవితాంతం బాపూజీ వేషధారణలోనే సంచరించారు. అంజలక్ష్మి స్వయంగా వడికిన నూలుతో చేసిన ఖద్దరు వస్త్రాలనే ధరించారు. విదేశీ వస్త్రాల బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఇద్దరినీ 1931లో జైలుకు పంపించింది ఆంగ్లేయ సర్కారు. చంకలో నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణను పట్టుకొనే జైలుకెళ్లారు అంజలక్ష్మి.
కృష్ణమూర్తి- ఆరు నెలల గర్భిణి అంజలక్ష్మి దంపతులు.. మరికొందరు కార్యకర్తలతో కలసి రహస్యంగా పొలంగట్లపై నుంచి పోలీసుల కంటపడకుండా భీమవరం చేరి సమావేశం నిర్వహించారు. అనంతరం కృష్ణమూర్తి మరికొందరు సహచర యోధులతో భవనంపైకెక్కి మువ్వన్నెల కాంగ్రెస్ జెండాను ఎగురవేసి వందేమాతరం అంటూ నినదించారు. పోలీసులు త్రివర్ణ పతాకావిష్కరణను అడ్డుకోకుండా అంజలక్ష్మి.. తన సహచర మహిళలతో నిలువరించారు. ఈ సంఘటన దక్షిణాది బర్దోలిగా పేరొందింది. తర్వాత పోలీసులు ఈ సంఘటనలో పాల్గొన్న అందరినీ అరెస్టు చేశారు.
అంజలక్ష్మికి పది నెలల జైలుశిక్ష పడగా.. గర్భిణీగా ఉన్నా ఎలాంటి జంకులేకుండా జైలుకు వెళ్లారామె. అక్టోబరు 29న వెల్లూరు జైల్లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కృష్ణుడిలా కారాగారంలో పుట్టినందుకు ‘కృష్ణ’, భారతావని దాస్య శృంఖలాలు తెంచే పోరాటంలో భాగమైనందుకు ‘భారతి’ కలిపి.. ఆ బిడ్డకు కృష్ణభారతి అని పేరుపెట్టారు. 1933 ఏప్రిల్లో ఆరునెలల పసిగుడ్డుతో అంజలక్ష్మి జైల్లోంచి బయటకు వస్తుంటే.. ప్రజలు నీరాజనాలు పట్టారు. ఈ నేపథ్యంలో వారి కుమార్తె కృష్ణ భారతికి ప్రధాని పాదాభివందనం చేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates