ఏపీ పుణ్య‌భూమి, వీర‌భూమి.. శ్లాఘించిన మోడీ

ఆంధ్రప్రదేశ్ దేశభక్తుల పురిటిగడ్డ అని, అల్లూరి స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. సభా ప్రాంగణం నుంచే వర్చువల్‌ ద్వారా విగ్రహావిష్కరణ చేసిన అనంతరం మాట్లాడారు. ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించిన మోడీ.. మన్యం వీరుడికి ఘనంగా నివాళులర్పించారు.

అల్లూరి తెలుగు జాతి యుగపురుషుడు. యావత్‌ భారతావనికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన అల్లూరి జయంతి రోజున మనందరం ఇక్కడ కలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం పుణ్యభూమి.. వీరభూమి.. ఇలాంటి పుణ్యభూమికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. యావత్‌ భారత్‌ తరఫున అల్లూరి పాదాలకు వందనం చేస్తున్నా. అల్లూరి కుటుంబంతో వేదిక పంచుకోవడం నా అదృష్టం. దేశం ఇప్పుడు 75వ స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకుంటోంది.

రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయింది. ఇలాంటి సమయంలో.. మన్యం వీరుడి 125వ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఆదివాసీల శౌర్యం, ధైర్యానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు. అల్లూరి జీవన ప్రస్థానం మనందరికీ స్ఫూర్తిదాయకం. “మనదే రాజ్యం” నినాదంతో ప్రజలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన ఘనత అల్లూరిది. మన్యం వీరుడిగా ముందుకొచ్చి ఆంగ్లేయులతో వీరోచితంగా పోరాడారు. ఆనాడు ఆంగ్లేయులకు ఎదురొడ్డి ఎందరో యువకులు పోరాడారు.

నేడు.. దేశాభివృద్ధిలో సైతం యువత భాగస్వామ్యం మరింత పెరగాలి. ఆంధ్ర రాష్ట్రం ఎందరో దేశభక్తులకు పురుడు పోసిన గడ్డ. పింగళి వెంకయ్య, కన్నెగంటి హనుమంతు, పొట్టి శ్రీరాములు, వీరేశలింగం పంతులు వంటి మహానుభావులను కన్న భూమి ఆంధ్రప్రదేశ్‌. దేశం కోసం బలిదానం చేసిన ఇలాంటి వారి కలలను సాకారం చేయాలి. ఈ బాధ్యత అందరిపైనా ఉంది.

దేశ చరిత్రలో అనాదిగా ఒకే దేశం, ఒకే భావన భాగమై ఉంది. ఆ భావనతోనే.. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారు. అలాంటి త్యాగధనులను నిరంతరం స్మరించుకుని ముందుకెళ్లాలి. వారి స్వాతంత్ర్య పోరాట పటిమ గురించి అందరికీ తెలియాలి. ఆ స్ఫూర్తికోసమే ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు జరుపుకుంటున్నాం. అని ప్ర‌ధాని పేర్కొన్నారు.