పార్టీని లాక్కోవటం అంత వీజీ కాదు ?

తిరుగుబాటు లేవదీసి ముఖ్యమంత్రి కుర్చీని ఉద్థవ్ థాక్రే నుండి లాగేసుకున్నంత తేలిక కాదు పార్టీని, పార్టీ గుర్తును లాగేసుకోవటం. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో కీలకమైన శివసేనలో తిరుగుబాటు జరిగిన విషయం తెలిసిందే. ఏక్ నాథ్ నాయకత్వంలో కొందరు ఎంఎల్ఏలు థాక్రేపై తిరుగుబాటు లేవదీశారు. అనేక మలుపులు తిరిగిన తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. తిరుగుబాటు నేత షిండేయే చివరకు ముఖ్యమంత్రి కుర్చీపై కూర్చున్నారు.

ఇంతవరకు సీన్ ప్రశాంతంగానే జరిగింది. కానీ ఇకముందు జరగబోయేదేమిటి ? అనేదే ఆసక్తిగా మారింది. జరగబోయేదేమిటంటే కుర్చీని లాగేసుకుంటే సరిపోదు పార్టీని, పార్టీ గుర్తుతో పాటు పార్టీకున్న ఆస్తులను కూడా లాగేసుకోవాలని షిండే గట్టిగా డిసైడ్ అయ్యారు. అయితే అదంతా వీజీకాదని అర్దమైపోతోంది. ఎందుకంటే థాక్రేని దింపేశారంటే 55 మంది ఎంఎల్ఏల్లో 40 మంది మద్దతిచ్చారు కాబట్టి సరిపోయింది. నిజానికి వీళ్ళ తిరుగుబాటుకు వెనక నుండి పూర్తి మద్దతిచ్చింది బీజేపీనే.

బీజేపీ ప్రోద్బలం, వ్యూహం లేకపోతే షిండే అసలు తిరుగుబాటుకు ప్రయత్నించేవారు కాదు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే పార్టీతో పాటు గుర్తు, ఆస్తులను తీసుకోవాలంటే పెద్ద తతంగమే నడవాల్సుంటుంది. గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర కార్యవర్గం వరకు షిండేకి మద్దతివ్వాలి. అలాగే పార్టీలోని అనుబంధ సంఘాల కార్యవర్గాలన్నీ షిండేకి మద్దతివ్వాలి. పార్టీలోని అత్యున్నత విధాన కార్యవర్గం కూడా మద్దతు పలకాల్సుంటుంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలతో పాటు అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ ఉంటే దాని మద్దతు కూడా షిండేకి దక్కాల్సిందే.

చివరకు కార్యకర్తల అభిప్రాయాలు కూడా అవసరమేనట. ఇవన్నీ జరగాలంటే ముందు షిండే గ్రామస్థాయి నుండి రాష్ట్రస్ధాయి వరకు సమావేశాలు నిర్వహించాలి. ఈ కార్యవర్గాలన్నీ షిండేకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇవన్నీ మద్దతివ్వకపోతే షిండేకి పార్టీ, గుర్తు, ఆస్తులపై ఆధిపత్యం రాదు. అంతా అయిన తర్వాత చివరకు కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్ణయం కూడా కీలకమే. ఇదంతా చూసిన తర్వాత థాక్రేని కూల్చినంత తేలిక్కాదు పార్టీని దక్కించుకోవటమని అర్ధమైపోవట్లా ?