బ్యాడ్ టైం : రఘురామరాజుకు హైకోర్టు అక్షింతలు

రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు దాఖలు చేస్తున్న నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టు అక్షింతలు వేసింది. ఎంపీ దాఖలు చేసిన కేసు సంక్షేమ ఫలాలు అందుకుంటున్న పేదల సంక్షేమానికి వ్యతిరేకంగా ఉందని తీవ్రంగా ఆక్షేపించింది. ఎంపీ వేసిన కేసు పేదల సంక్షేమానికి వ్యతిరేకంగా ఉందని తేల్చి చెప్పేసింది. ఆయన ఉద్దేశ్యం ప్రజా ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకం కాబట్టే కేసును కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.

మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి ప్రభుత్వం ఆర్ధిక సంస్ధల నుంచి అప్పు తీసుకోవటాన్ని ఆక్షేపిస్తూ ఎంపీ హైకోర్టులో కేసు వేశారు. నిజానికి ఇందులో పేదల సంక్షేమం కోణం ఏమీలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి మీద మంటతో అందుతున్న అప్పులను అడ్డుకుని దానిద్వారా సంక్షేమ పథకాల అమలును నిలిపేయాలన్న ఆలోచనే కనబడుతోంది. కోర్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆపేయాలన్నదే పిటీషనర్ ఉద్దేశ్యంగా కనబడుతోందని మండిపడింది.

ప్రభుత్వం ఏ రూపంలో అప్పు తీసుకొస్తే పిటీషనర్ కు వచ్చిన సమస్య ఏమిటని నిలదీసింది. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్నది మాత్రమే కీలకమన్నారు. ప్రభుత్వం అప్పులు చేయకుండా నిలపాల్సిన బాధ్యత కోర్టులకు లేదని స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ ఆర్ధిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటానికి కోర్టు నిరాకరించింది. ఎంపీ దాఖలు చేసిన పిటిషన్ ను ఏ కోణంలో చూసినా విచారణర్హత లేదని తేల్చేసింది.

ప్రభుత్వం చేస్తున్న అప్పును అడ్డుకుంటే సంక్షేమ పథకాల అమలుపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిటీషనర్ కు తెలీదా ? అంటూ సూటిగా ప్రశ్నించింది. అన్నీ తెలిసే కేసు వేస్తున్నారంటే కేవలం దురుద్దేశ్యంతోనే పిల్ దాఖలు చేసిన విషయం అర్ధమైపోతోందని చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నిబంధనలకు, పేదల సంక్షేమానికి ఎలాంటి సంబంధం లేదు కాబట్టే ఎంపీ దాఖలు చేసిన కేసును కొట్టేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.