వివాదాల్లో కీల‌క నేత‌లు.. వైసీపీ ప‌వ‌ర్ త‌గ్గుతోందా?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ మ‌రింత బ‌లోపేతం అయ్యేలా ఉండాలి. ఇదే వైసీపీ అధినేత‌… సీఎం జ‌గ‌న్ కూడా కోరుకున్నారు. అయితే.. దీనికి భిన్నంగా వైసీపీలో వివాదాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. అంతేకాదు.. కీల‌క‌ నేతలను కూడా వివాదాల్లోకి లాగుతున్నారు. కొన్ని చోట్ల పరిస్థితి చేయి దాటి దాడులు, ప్రతిదాడులు చేసుకునే వరకు వెళ్తోంది.

నిన్న మొన్నటి వ‌ర‌కు మంత్రులుగా ఉన్న‌వారు. కీల‌క నాయ‌కులు.. జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులుగా పేరు తెచ్చుకున్న‌వారు.. సైతం సొంత పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. మరికొందరు బహిరంగ వేదికలెక్కి విమర్శలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో రోజురోజుకూ నేతల నడుమ దూరం పెరుగుతోందే తప్ప.. సఖ్యత కుదరడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సన్నిహిత బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాకు చెందిన ఓ అగ్ర నేతపై(ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అనే ప్ర‌చారం ఉంది) విమర్శలు గుప్పిస్తున్నారు.

తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రతిపక్ష టీడీపీ నాయకులతో కలిసి సొంత పార్టీ నేతలే కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. తనపైన, తన కుమారుడిపైనా దుష్ప్రచారం చేస్తున్నారని.. వారి సంగతి తేలుస్తానని హెచ్చరించారంటే.. ప‌రిస్థితి ఏ రేంజ్‌లో ఉందో అర్ధ‌మ‌వుతోంది. ఇక‌, నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మద్దతు పలకడం గమన్హార్హం. తానూ సొంత పార్టీ నేతల బాధితుడినేనని వాపోయారు.

పరోక్షంగా మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మరో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ ఉద్దేశించి కోటంరెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో అనిల్‌కుమార్‌కు సీఎం ఉద్వాసన పలికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దనరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై అనిల్‌ కాకాణిపై విమర్శలు గుప్పించారు.

దీంతో.. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఇద్దరినీ తాడేపల్లి పిలిపించి మందలించి పంపారు. అప్పటికి పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపించినా.. అంతర్గతంగా కలహాలు అలాగే ఉన్నాయని.. ఇద్దరి మధ్య దూరం కొనసాగుతూనే ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అటు అనిల్‌, ఆనం కూడా ఎడముఖం పెడముఖం గానే ఉంటున్నారు.

రాయలసీమలోని.. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కూ.. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి మధ్య వర్గపోరు నడుస్తోంది. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డితోనూ హఫీజ్‌ఖాన్‌కు పొసగడం లేదు. నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌కు, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ రెండు జిల్లాల్లో ఎమ్మెల్యేలకు, ద్వితీయశ్రేణి నాయకులకు కూడా పడకపోవడం గమనార్హం.

ఇక శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ నేత నవీన్‌ నిశ్చల్‌, ఎమ్మెల్సీ ఇక్బాల్‌ మధ్య వివాదం పరస్పర దాడుల దాకా వెళ్లింది. ఇక్బాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు సిద్ధమైన నవీన్‌ నిశ్చల్‌పై ఎమ్మెల్సీ వర్గీయులు దాడికి తెగబడ్డారు. ఇందులో ఎమ్మెల్సీ కూడా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా చూస్తే.. ఈ వివాదాల కార‌ణంగా గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఇప్పుడు వైసీపీ ప‌రిస్థితి ఎదురీత‌గా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.