ఏపీలో జ‌గ‌న‌న్న బ‌స్సు బాదుడు.. కేసీఆర్ ఎఫెక్టేనా!

“మేం బ‌స్సు చార్జీలు పెంచుతున్నాం.. మీరు కూడా చార్జీలు పెంచండి!”అంటూ కొన్నాళ్ల కింద‌ట‌.. తెలంగాణ ప్ర‌భుత్వం ఏపీకి లేఖ రాసింది. అయితే.. అప్ప‌ట్లో దీనిని ప‌క్క‌న పెట్టిన ఏపీ ప్ర‌భుత్వం.. తాజాగా ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచేందుకు రెడీ అయింది. జూలై 1 నుంచి బస్సు ఛార్జీలు పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. డీజిల్‌ సెస్‌ పెంపు వల్ల ఛార్జీలు పెంచక తప్పలేదని అధికారులు చెబుతున్నారు.

వాస్త‌వానికి డీజిల్‌ సెస్‌ పెంపు కారణంగా ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణికులు ఇతర రాష్ట్రాల ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు బస్సులు నడిపించే ఆర్టీసీ సంస్థలకు టీఎస్ఆర్టీసీ సర్క్యులర్‌ జారీ చేసింది. అంతర్‌రాష్ట్ర రవాణా సంస్థల ఒప్పందం ప్రకారం ఆయా రాష్ట్రాల మధ్య తిరిగే బస్సు ఛార్జీలు ఒకేలా ఉండాలనే నిబంధన ఉందని టీఎస్‌ ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఈ మేరకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లకు టీఎస్‌ ఆర్టీసీ అధికారులు గతంలో సర్క్యులర్‌లను కూడా పంపారు. ప్రభుత్వంలో ఏపీఎస్‌ ఆర్టీసీ విలీనం కావడంతో తెలంగాణ ప్రాంతంలో తిరిగే ఏపీఎస్‌ ఆర్టీసీ బస్సుల ఛార్జీలపై నిర్ణయం ఇప్పుడే తీసుకోలేమని చెప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఎట్టకేలకు టికెట్‌ ధరలు పెంచేందుకు రంగం సిద్ధం చేసింది.

పల్లె వెలుగు బస్సుల్లో ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10. తొలి 30 కిలోమీటర్ల వరకు సెస్‌ పెంపు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. 35 నుంచి 60 కి.మీ వరకు అదనంగా రూ.5లు సెస్‌ విధించారు. 60 నుంచి 70 కి.మీ వరకు రూ.10. 100 కి.మీ ఆపైన రూ.120 సెస్‌ విధించారు. ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌పై రూ.5 సెస్ వసూలు చేస్తున్నారు.

ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో 31 కిలోమీట‌ర్ల‌ నుంచి 65 కి.మీ వరకు మరో రూ.5 సెస్‌. 66 నుంచి 80కి.మీ వరకు రూ.10 పెంపు. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్‌పై రూ.10 డీజిల్ సెస్ వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 55 కి.మీ వరకు సెస్ పెంపు లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.70 సెస్ పెంపు. హైదరాబాద్ వెళ్లే అమరావతి బస్సుల్లో రూ.80 చొప్పున డీజిల్‌ సెస్‌ విధించారు. దీంతో ప్ర‌జ‌ల‌పై పెను భారం ప‌డింద‌న‌డంలో సందేహం లేదు.