ఏపీలో కొత్త ట్రెండ్.. బినామీ పేర్లతో కరోనా పరీక్షలు

ఇప్పటివరకూ బినామీలను చూశాం. బినామీల పేరుతో ఆస్తులు ఉండటాన్ని చూశాం. అందుకు భిన్నంగా కరోనా విరుచుకుపడుతున్న వేళ.. రెండు తెలుగురాష్ట్రాల్లోని రాజకీయ వర్గాల్లోనూ కొత్త గుబులు పుట్టిస్తోంది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కేసుల తీవ్రతగా తక్కువగా ఉన్నట్లు చెబుతారు. తొలుత తెలంగాణలో ఎక్కువ అనిపించినా.. తర్వాతి కాలంలో పరిస్థితి కంట్రోలోకి తెచ్చినట్లుగా సీన్ కనిపించింది. దీంతో.. పలువురు సీఎం కసీఆర్ ను తెగ పొగిడేశారు. తర్వాతి కాలంలో తెలంగాణను దాటేయటమే కాదు.. పాజిటివ్ కేసుల్ని పెద్ద ఎత్తున నమోదవుతున్న పరిస్థితి.

తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో నిర్దారణ పరీక్షలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం తెలంగాణలో ఇప్పటికి రాష్ట్ర సర్కారు యాభై వేల పరీక్షలే చేస్తే.. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా ఆరున్నర లక్షల పరీక్షలు నిర్వహించారు. మరిన్ని పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిర్దారణ పరీక్షల విషయంలో కొందరు బడాబాబులు అనుసరిస్తున్న దరిద్రపు గొట్టు యవ్వారం తాజాగా బయటకు వచ్చింది.

ఇప్పటికే ఏపీకి చెందిన పలువురు నేతలకు కరోనా పాజిటివ్ రావటంతో రాజకీయ వర్గాల్లో కలకలాన్ని రేపుతోంది. ముఖ్యమంత్రి జగన్ తో సహా పలువురు మంత్రులు.. ముఖానికి పెట్టుకోవాల్సిన మాస్కుల్ని సైతం ధరించకపోవటం హాట్ టాపిక్ గా మారింది. ఈ తీరు ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ తమ తీరుపై వచ్చిన విమర్శల్ని ఏపీ అధికారపక్ష నేతలు అస్సలు పట్టించుకోవటం లేదు.

అధికార పార్టీ నేతల సంగతి ఇలా ఉంటే.. ప్రభుత్వాధికారులు సైతం ఇదే విధానాన్నిఫాలో అవుతున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. ముఖానికి మాస్కులు సైతం పెట్టుకోకుండా కార్యక్రమాలకు హజరయ్యే అధికారులు పలువురు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. వాటిని పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణ ఉంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. రోగ లక్షణాలకు సంబంధించిన సందేహాలు ఉన్న నేతలు పలువురు కొత్త ప్లాన్ వేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా తమ నిర్దారణ పరీక్షల్ని వేరే వారి పేరు మీద చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టెస్టుల్లో నెగిటివ్ వస్తే పట్టించుకోని నేతలు.. పాజిటివ్ వస్తే మాత్రం గుట్టుచప్పుడు కాకుండా చికిత్స చేయించుకుంటున్న వైనం బయటకు వచ్చింది.

ఇటీవల ఒక మాజీ ఎమ్మెల్యే.. మాజీ ఎంపీ తన వ్యక్తిగత సిబ్బంది వివరాల్ని ఇచ్చి.. తమ పరీక్షల్ని చేయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. పరీక్షల సమయంలో నమూనాలు సేకరించే వారి దగ్గర ఆధార్ వివరాలతో పాటు.. ఫోన్ నెంబరు తీసుకుంటున్నారు. కానీ.. పలువురు నేతలు.. ప్రముఖులు మాత్రం తమ సిబ్బంది పేర్ల మీద టెస్టుల్ని చేయించుకుంటున్న వైనం బయటకు వచ్చింది. ఇదిప్పుడు సంచలనంగా మారింది. కరోనా కాలంలోనూ బినామీల వ్యవహారం తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.