అమరావతి భూముల అమ్మ‌కం.. ప్లాన్ సిద్ధం చేసిన జ‌గ‌న్ స‌ర్కారు

ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం అప్పుల్లో కూరుకుపోయిన నేప‌థ్యంలో ఏదో ఒక విధంగా నిధుల‌ను సేక‌రించేందుకు అన్ని దారుల‌ను వినియోగించుకుంటోంది జ‌గ‌న్ సర్కారు. ఈ క్ర‌మంలో స‌ర్కారు నిధుల సేకరణకు రాజధానిలో ఉన్న భూములను విక్రయించేం దుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌ రూపొందించింది. తొలి విడతలో 248.34 ఎకరాలు విక్రయించాలని నిర్ణయించింది. ఎకరానికి రూ.10 కోట్ల చొప్పున రూ.2480 కోట్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ ఇటీవల 389 జీవోను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పురపాలక శాఖ ద్వారా ఈ జీవోను జారీ చేశారు.

వచ్చే నెలలోనే వేలం ద్వారా భూములను విక్రయించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయలను కల్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిధుల సేకరణలో భాగంగా రాజధాని భూముల విక్రయానికి సీఆర్డీఏ ప్రణాళికలు రూపొందించింది. గతంలో మెడ్‌సిటీ కోసం ఇచ్చిన 100 ఎకరాలతో పాటు, లండన్‌కింగ్స్‌ కాలేజీ నిర్మాణం కోసం 148 ఎకరాలు ఇచ్చేందుకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

ఆయా సంస్థలు నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఆ భూములను వేలం వేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. పురపాలకశాఖపై ఇటీవల సీఎం నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అమరావతి నిర్మాణానికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకు భూములు అమ్మాలని సీఆర్డీఏ నిర్ణయించింది.

వచ్చే ఏడాది కూడా 600 ఎకరాలు దశల వారీగా విక్రయించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఏడాదికి 50 ఎకరాలు చొప్పున.. ఎకరా రూ.10కోట్లకు విక్రయించాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే, తొలి విడతలో మాత్రం 248.34 ఎకరాలను విక్రయించాలని భావిస్తున్నారు. తద్వారా రూ.2,480 కోట్లు సమీకరించాలని ప్రణాళిక రూపొందించారు. ఇప్ప‌టికే ఇక్క‌డి భూముల‌విక్ర‌యంపై రైతులు ఆందోళ‌న చేస్తున్నా.. స‌ర్కారు ఏమాత్రం బెద‌ర‌కుండా.. ఇలా అడ్డ‌గోలు నిర్ణ‌యాలు తీసుకోవ‌డంపై స‌ర్వ‌త్రా విస్మ‌యం వ్య‌క్తం అవుతుండ‌డం గ‌మ‌నార్హం.