బీఆర్ఎస్‌.. ప్ర‌క‌ట‌న వాయిదా.. వ్యూహం మార్చిన కేసీఆర్‌

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును గ‌ద్దె దింపే వ‌ర‌కు నిద్ర‌పోను అన్న‌ట్టుగా వ్యాఖ్య‌లు చేస్తున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. ఈ క్ర‌మంలో తాను జాతీయ పార్టీ పెట్టేందుకు రెడీ అయ్యార‌నే సంకేతాలు పంపించారు. దీనికి సంబంధించి ‘బీఆర్ ఎస్‌’ అంటే.. భార‌త‌ రాష్ట్ర స‌మితి పేరును కూడా ఆయ‌న ఖ‌రారు చేశార‌నివార్త‌లు వ‌చ్చాయి. ఇక‌, ఈ నెల ఆఖ‌రులోనే ఆయ‌న ప్ర‌క‌ట‌న చేస్తార‌ని కూడా ప్ర‌గతి భ‌వ‌న్ వ‌ర్గాల నుంచి స‌మాచారం గుప్పుమంది.

అయితే.. ఇప్పుడు కేసీఆర్ వెన‌క్కిత‌గ్గార‌నే స‌మాచారం తెర‌మీదికి రావ‌డం ఆస‌క్తిగా మారింది. ఈ నెల ఆఖ‌రులోనే జాతీయ పార్టీపై ఒక ప్ర‌క‌ట‌న చేయాల‌ని అనుకున్నా.. జాతీయ స్థాయిలో మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో త‌న ప్ర‌క‌ట‌న‌ను కేసీఆర్ వాయిదా వేసుకున్న‌ట్టు తెలుస్తోంది. నిజానికి కేసీఆర్ పెట్టనున్న జాతీయ పార్టీ గురించి ఇటు రాష్ట్రం అటు దేశ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

పార్టీ పెడతానని ప్రకటించినప్పటి నుంచే విభిన్న రకాలుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే అనధికారికంగా.. పార్టీ పేరు సైతం ప్రచారంలోకి వచ్చేసింది. అయితే.. అధికారంగా పార్టీని ఎప్పుడు ప్రకటిస్తారన్నది మాత్రం ఉత్కంఠగా మారింది. కొత్త జాతీయ పార్టీని రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే ఏర్పాటు చేయాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలిసింది.

ఈ నెలలోనే పార్టీ ప్రారంభించాలని భావించినా.. రాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా ఇది అనుకూల సమయం కాదనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రపతి ఎన్నికలకు మూడు వారాలకుపైగా గడువు ఉన్నం దున అప్పటి వరకు కొత్త పార్టీకి సంబంధించిన కసరత్తు కొనసాగించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలే ప్రధానాంశంగా ఉన్నందున కొత్త జాతీయ పార్టీని తర్వాత ప్రకటించాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇస్తామని ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌కు హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణులతో చర్చించి, మద్దతుపై నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు.

కొత్త జాతీయ పార్టీ సన్నాహాల్లో భాగంగా కేసీఆర్‌ దేశంలోని ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులు, విశ్రాం త ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో చర్చలు నిర్వహిస్తున్నారు. ఆర్థిక నిపుణుల బృందంతో ప్రగతిభవన్‌లో సమావేశమయ్యారు. అదేవిధంగా జాతీయ మీడియా ప్రముఖులతో చర్చించారు. వచ్చేనెల రెండోవారం వరకు ఈ చర్చలు కొనసాగనున్నట్లు తెలిసింది. మొత్తానికి రాష్ట్ర‌ప‌తి ఎన్నికల‌ నేప‌థ్యంలో మారిన ప‌రిణామాల రీత్యా.. కేసీఆర్ త‌న నిర్ణ‌యాన్ని కూడా మార్చుకోవ‌డం.. గ‌మ‌నార్హం.