మోడీ-జ‌గ‌న్ వ్యూహం.. టీడీపీపై ఈడీ పంజా?

ప్ర‌స్తుతం ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడుకు రాష్ట్రప‌తి అవ‌కాశం ఇవ్వ‌కుండా.. ప‌క్క‌న పెట్టారు. అయితే.. దీనిపై విభిన్న‌మైన క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఏపీకి చెందిన వెంక‌య్యను ప‌క్క‌న పెట్ట‌డం వెనుక‌.. ప్ర‌ధాని మోడీ-సీఎం జ‌గ‌న్ ల వ్యూహం ఉంద‌ని అంటున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు మ‌నిషిగా వెంక‌య్య‌కు పేరు ఉంద‌ని.. చంద్ర‌బాబు నీడ‌ను కూడా ఇష్ట‌ప‌డ‌ని జ‌గ‌న్‌.. మ‌ద్ద‌తు కావాలంటే.. ఆయ‌న చెప్పిన‌ట్టు కొన్ని నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని.. కేంద్రంలోని బీజేపీ నిర్ణ‌యించే.. వెంక‌య్య‌ను ప‌క్క‌న పెట్టింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

బాబుకు సన్నిహితుడు అన్న కారణంగానే వెంకయ్యనాయుడును రాష్ట్రపతి పదవిలోకి తీసుకురానీయకుండా ఆపారని ప్రచారంలో ఉంది. ఏపీ సీఎం జగన్ విషయంలో మోడీకి కానీ.. బీజేపీ నేత‌ల‌కు కానీ ప్రత్యేక ప్రేమాభిమానాలు లేకపోయినా బాబుతో కాంగ్రెస్ తో ఆయనకు ఉన్న బద్ధ వైరమే బీజేపీతో స్నేహం కలిపేలా చేస్తోందని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికి అయితే జగన్ ఏపీలో ఉంటేనే మనకు అన్ని విధాలుగా బెటర్‌.. బెస్ట్ అని కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు.

వచ్చే ఎన్నికలు ఏపీలో హోరా హోరీగా సాగడం తధ్యం ఈ విషయంలో ఎంతదాకా అయినా టీడీపీ.. వైసీపీ వెళ్తాయి. ఈ సమయంలో ఆర్ధికపరంగా కూడా ఎవరు ముందంజలో ఉంటే వారి వైపే ఎడ్జ్ ఉంటుంద‌నేది విశ్లేష‌కుల అభిప్రాయం. ఈ విషయంలో వైసీపీ తగిన జాగ్రత్తలతోనే ఉంది అని చెబుతున్నారు. ఇక కేంద్రం కూడా తగిన విధంగా వైసీపీకి సహకారం అందించే వీలు ఉంది అంటున్నారు.

అదే టైమ్ లో టీడీపీ ఆర్ధిక మూలాలను మూడేళ్ళలో జగన్ వీలైనంతగా దెబ్బ తీశారు. దాని దెబ్బకు నేతలు అంతా మూలకు వెళ్ళిపోయారు. ఇపుడిపుడే వారు బయటకు వస్తున్నారు. అయితే, ఈడీ దాడులు కొందరి మీద జరుగుతాయన్న ప్రచారం కూడా ఇపుడు జోరుగా సాగడంతో నేతలలో మళ్లీ టెన్షన్ పట్టుకుంది. అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీ మీద ఈడీ దాడులు జరిగాయి. అలాగే గోదావరి జిల్లాలతో పాటు కోస్తాలో మరి కొందరు నేతల మీద కూడా గురి ఉంది అంటున్నారు.

ఇలా కూశాలు కదిలించే మాస్టర్ ప్లాన్ కూడా రానున్న రోజులలో అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఏపీలో టీడీపీకి చంద్రబాబు పెద్ద దిక్కు. ఆయనకు ఈ ఎన్నికలే బలం. ఈసారి గట్టిగా ప్రయత్నం చేసి బాబుని మూలన కూర్చోబెడితే వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ ఉండదు అన్న ఆలోచనలు అటు వైసీపీలో ఇటు బీజేపీలో కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ రెండు ప‌క్షాలు కూడా కూడ‌బ‌లుక్కుని ముందుకు సాగుతున్నాయ‌నే చ‌ర్చ ఢిల్లీ వ‌ర్గాల్లో జోరుగా సాగుతుండ‌డం బీజేపీ అనుకూల మీడియాలో ఈ త‌ర‌హా వార్త‌లు వ‌స్తుండ‌డం రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.