రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిపై.. వ‌ర్మ రేపిన రాజ‌కీయ మంట‌

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఆదివాసీ గిరిజ‌న నాయ‌కురాలు, మాజీ గ‌వ‌ర్న‌ర్‌.. మాజీ మంత్రి.. ఒడిసాకు చెందిన ద్రౌప‌ది ముర్మును ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. ఆమె గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కే అవుతుంద‌న్న అంచ‌నాలు కూడా ఉన్నాయి. అయితే.. ద్రౌప‌ది ఎంపిక‌పై వివాదాల‌కు కేరాఫ్‌గా ఉన్న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌.. చేసిన ట్వీట్ .. రాజ‌కీయ కాక రేపింది. “రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది. అయితే.. పాండ‌వులు ఎవ‌రు? కౌర‌వులు ఎవ‌రు?” అని వ‌ర్మ సంచ‌ల‌న ట్వీట్ చేశారు.

దీనిపై బీజేపీ నాయ‌కులు నిప్పులు చెరిగారు. ఏపీ, తెలంగాణ‌లోని బీజేపీ నాయ‌కులు వ‌ర్మ‌పై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్ముపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్మ ట్వీట్‌ను సుమోటొ‌గా తీసుకుని పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వర్మలాగా ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలంటే ముందు వర్మని జైలుకి పంపాలన్నారు. అలాగే వర్మను మానసిక వైద్యుడి చూపించాల్సిన అవసరం ఉందన్నారు.

అదేవిధంగా తెలంగాణ‌లోని ఘోషామ‌హ‌ల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘ఆర్జీవీని వేస్ట్ ఫెలో’ అన్నారు. రాంగోపాల్ వర్మ మందు తాగి ట్వీట్స్ చేస్తారని ఫైర్ అయ్యారు. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వార్తల్లో ఉండేందుకు వర్మ ప్రయత్నాలు చేస్తుంటారని, ద్రౌపది ముర్ముపై వర్మ ట్వీట్‌ను ఖండిస్తున్నామన్నారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికకానున్న సమయంలో వర్మ ట్వీట్ బాధాకరమని రాజాసింగ్ చెప్పుకొచ్చారు.

కేసు.. న‌మోదు..

వ‌ర్మ‌ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటు రాంగోపాల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జీవీని వేస్ట్ ఫెలోతో పోల్చారు. ఆర్జీవీపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికకానున్న సమయంలో వర్మ ట్వీట్ బాధాకరమన్నారు. కాగా.. వర్మ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. కించపర్చడం తన ఉద్దేశం కాదన్నారు. అయినా.. రాజ‌కీయంగా మాత్రం వ‌ర్మ రేపిన వివాదం ఎక్క‌డా ఆగ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.