అమ్మ ఒడిలో స్కాల‌ర్ షిప్ క‌ట్‌.. మోసం గురూ!

ఏపీలోని జగ‌న్ స‌ర్కారు ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న అమ్మ ఒడి ప‌థ‌కంలో అంతులేని మోసం వెలుగు లోకి వ‌చ్చింద‌ని.. ల‌బ్ధిదారులు అంటున్నారు.. అంతేకాదు.. దీనికి సంబంధించి సాక్ష్యం కూడా చూపిస్తు న్నారు. వాస్త‌వానికి ఈ ప‌థ‌కంలో ల‌బ్ది దారుల సంఖ్య‌ను గ‌త ఏడాది కంటే.. ల‌క్ష మందిని త‌గ్గించార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. విద్యార్థుల అటెండెన్సు.. 75 శాతం లేద‌ని… ల‌బ్ధిదారుల కుటుంబం విద్యుత్ వాడకం ఎక్కువ‌గా చేసింద‌ని.. ట్యాక్సులు క‌డుతున్నార‌ని.. ఇలా అనేక కార‌ణాల‌తో ల‌బ్ధిదారుల సంఖ్య‌ను కుదించారు.

దీనిపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే.. విద్యార్థ‌లు అటెండెన్స్ ఉండాల‌ని.. వారు చ‌దువు కోవాల‌నే ఉద్దేశంతోనే తాము ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని.. కాబ‌ట్టి.. ఎక్క‌డా కూడా ల‌బ్ధిదారుల సంఖ్య‌ను కుదించే ప్ర‌య‌త్నం లేద‌ని తాజాగా మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ చెప్పుకొచ్చారు. ఓకే.. ఈ విష‌యం ఎలా ఉన్నా.. తాజాగా ప్ర‌భుత్వం ల‌బ్ధిదారుల జాబితాను విడుద‌ల‌చేసింది. దీనిలో ఎన్నిక‌ల‌కు ముందు చెప్పిన రూ.15000 ల‌కు బ‌దులుగా.. పాఠ‌శాల‌ల్లో మ‌రుగు దొడ్ల నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు కింద రూ.1000 కోత పెట్టారు.

అంటే.. అమ్మ ఒడి అర్హుల‌కు కేవ‌లం 14000 మాత్ర‌మే వ‌స్తాయి. స‌రే.. అదే అనుకున్నా.. ఇందులో ఇప్పుడు కొత్త లిటిగేష‌న్ పెట్టారు. అమ్మ ఒడి అర్హులైన కుటుంబాల్లోని విద్యార్థులు ఇత‌ర‌త్రా.. ఏమైనా ప్ర‌బుత్వం నుంచి ల‌బ్ధి పొందుతుంటే… ఆ మొత్తాల‌ను కూడా.. ఈ అమ్మ ఒడి నిధుల నుంచి కోత పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజాగా ప్ర‌క‌టించిన జాబితాను ప‌రిశీలిస్తే.. ఎస్సీ విద్యార్థుల‌కు ఇచ్చిన.. పోస్టు మెట్రిక్ స్కాల‌ర్ షిప్పుల సొమ్మును ఈ అమ్మ ఒడి సొమ్ము నుంచి మిన‌హాయిస్తున్నారు.

తాజా జాబితాలో మొల‌తోటి నిరీక్ష‌ణ అనే మ‌హిళ కుటుంబానికి చెందిన ఎస్సీ విద్యార్థి .. 3100 ఎస్సీ కోటాలో పోస్టు మెట్రిక్ స్కాల‌ర్ షిప్ తీసుకున్నాడు. అయితే.. ఈ మొత్తాన్ని అమ్మ ఒడితో ముడి పెట్టిన స‌ర్కారు.. ఆ స్కాల‌ర్ షిప్ ను ఈ సొమ్ము.. అంటే.. 14000 నుంచి కోత పెట్టింది. దీనిని ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన విద్యార్థులు తీవ్ర‌స్థాయిలో త‌ప్పు బ‌డుతున్నారు. ఇది మోసం గురూ! అంటున్నారు. మ‌రి దీనిపై స‌ర్కారు ఏం చెబుతుందో చూడాలి.