ద‌గ్గుబాటికి చంద్ర‌బాబు ప‌రామ‌ర్శ‌.. క‌లుస్తున్న మ‌న‌సులు!

ఎన్టీఆర్ పెద్ద అల్లుడు.. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వ‌రి భ‌ర్త‌, సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు.. ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు స్వ‌ల్ప గుండెపోటు వ‌చ్చింది. దీంతో ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప‌రీక్షించిన వైద్యులు.. స్టంట్ వేశారు. ప్ర‌స్తుతం ద‌గ్గుబాటి ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉన్న‌ట్టు వైద్యులు తెలిపారు. అయితే.. ద‌గ్గుబాటి అనారోగ్యానికి గుర‌య్యార‌ని తెలుసుకున్న ఆయ‌న తోడ‌ల్లుడు, అన్న‌గారిచిన్న‌ల్లుడు, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వెంట‌నే అపోలో ఆసుప‌త్రికి వెళ్లి.. ప‌రామ ర్శించారు.

ద‌గ్గుబాటి ఉన్న మెడిక‌ల్ రూంలోనే ప్ర‌త్యేక కుర్చీలో ఆయ‌న ప‌క్క‌గా కూర్చ‌ని చాలా ఆప్యాయంగా ప‌ల‌క‌రించారు. ఆరోగ్యం గురించి వాక‌బు చేశారు. చంద్ర‌బాబు ఆసుప‌త్రికి వ‌చ్చిన స‌మ‌యంలో ఆయ‌న వెంట ద‌గ్గుబాటి స‌తీమ‌ణి, బీజేపీ నాయ‌కురాలు పురందేశ్వ‌రి కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇరు కుటుంబాల మ‌ధ్య కుశ‌ల ప్ర‌శ్న‌లు సాగాయి. ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవా లంటూ.. చంద్ర‌బాబు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు, ద‌గ్గుబాటిల మ‌ధ్య ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం సాగడం..ఇరు ప‌క్షాలు న‌వ్వులు చిందించ‌డం.. ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది.

రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థ్యం స‌మ‌సిన‌ట్టేనా?!

నిజానికి నారా వ‌ర్సెస్ ద‌గ్గుబాటి కుటుంబాల మ‌ధ్య రాజ‌కీయ ప్ర‌త్యర్థిత్వం ఉంది. గ‌త 2019 ఎన్నిక‌ల్లోనూ.. టీడీపీపై ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు.. ప్ర‌త్య‌ర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున ప్ర‌కాశం జిల్లా ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి.. హోరా హోరీ త‌ల‌ప‌డ్డారు. చంద్ర‌బాబు ప‌థ‌కాల‌ను ఆయ‌న విమ‌ర్శించారు. కుల రాజ‌కీయాల చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. అయితే.. ఆయ‌న ఓడిపోయారు. ఇక‌, ఆయ‌న స‌తీమ‌ణి, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వ‌రి కూడా టీడీపీపై విమ‌ర్శ‌లు చేసేవారు.(ఇప్పుడు త‌గ్గింది). పైగా బీజేపీ త‌ర‌ఫున ఆమె ప్ర‌చారం చేశారు. ఇప్ప‌టికీ.. ఇరు కుటుంబాల మ‌ద్య రాజ‌కీయ వైరం కొన‌సాగుతోంద‌నే ప్ర‌చారం ఉంది. అయితే. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ రెండు కుటుంబాల మ‌ధ్య రాజ‌కీయ వైరం స‌మ‌సిన‌ట్టేనా? అనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.