త‌గ‌ల‌బ‌డుతున్న రైళ్ల‌తో యువ‌త సెల్ఫీలు..

‘అగ్నిప‌థ్’ సైనిక నియామ‌కాల‌ను వ్య‌తిరేకిస్తూ.. యువ‌త పెద్ద ఎత్తున సికింద్రాబాద్‌లో ఆందోళ‌న‌ల‌కు దిగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే రైళ్ల‌కు నిప్పు కూడా పెట్టింది. అయితే.. ఈ సంద‌ర్భంగా కొంద‌రు యువ‌కులు త‌గ‌ల బ‌డుతున్న రైళ్లకు ఎదురుగా నిల‌బ‌డి.. సెల్పీలు దిగ‌డం.. తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఉద్దేశ పూర్వ‌కంగానే రైళ్ల‌ను త‌గ‌లబెట్టి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టికే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముట్టడికి ఆందోళనకారులు ముందుగానే ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఏకంగా.. రెండు రోజుల ముందు నుంచి రైల్వే స్టేషన్ ముట్టడికి ప్రణాళికను సిద్ధం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ఆందోళనకారులు నిరసనకు దిగారని భావిస్తున్నారు. రైల్వే స్టేషన్ బ్లాక్ పేరుతో వాట్సాప్ గ్రూప్‌‌ను ఆందోళనకారులు క్రియేట్ చేశారు. ఈనెల 15న మధ్యాహ్నం 1:50 గంటలకు గ్రూప్ క్రియేట్ అయ్యింది. అలాగే వరంగల్ డిస్ట్రిక్ట్ ఓన్లీ పేరుతో మరో గ్రూప్‌తో పాటు, 15న ఉదయం 11:12 గంటలకు మరో గ్రూప్‌ను క్రియేట్ చేశారు. ఒక్క రోజులోనే గ్రూప్‌లో మొత్తం 1000 మంది జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

శుక్ర‌వారం ఉదయం 9:30 గంటల వరకు బస్సులు, టాక్సీలు, ప్రైవేట్ బండ్లు మాట్లాడుకుని మిగతా విద్యార్థులు హైదరాబాద్‌కు వచ్చారు. దాదాపు 500 మంది విద్యార్థులు 16 రాత్రి స్టేషన్ చుట్టు పక్కల ప్రాంతాలకు చేరుకున్నారు. రాత్రే స్టేషన్ లోపలకి 100 మంది విద్యార్థులు చేరుకున్నారు. ఎగ్జామ్ పెట్టాలని స్టేషన్ ముట్టడికి మొదట ప్లాన్ చేసినప్పటికీ… అగ్నిపథ్ స్కీం ప్రకటన తరువాత వాట్స్ అప్ గ్రూప్ క్రియేట్ అయ్యింది. ఫోన్స్, మెసేజ్‌ల ద్వారా యువకులు అప్‌డేట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే రైళ్లు ఆపి నిరసన తెలపాలని ఆందోళనకారులు భావించారు. ఈ పరిస్థితికి పోలీసుల అత్యుత్సాహమే కారణమని ఆందోళనకారులు ఆరోపించారు. పోలీసుల లాఠీచార్జ్‌తో నిరసనకారులు ఇంతటి విధ్వంసానికి దిగారని అంటున్నారు. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనపై పోలీస్ విచారణ కొనసాగుతోంది. వాట్సప్ గ్రూప్‌లతో అందరం కలిశామని నిరసనకారులు తెలుపడటంతో… వాట్సప్ గ్రూప్‌లపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ క్ర‌మంలో కొంద‌రు యువ‌కులు .. కాలిపోతున్న రైళ్ల ముందు నిల‌బ‌డి.. సెల్పీలు దిగ‌డం.. మ‌రింత వివాదానికి దారితీస్తోంది. మ‌రి ఈ కేసు ఎటు మ‌లుపు తిరుగుతుందో చూడాలి.