జీవీఎల్ అంత మాట అనేశాడేంటి ?

వైసీపీకి భ‌విష్య‌త్ లేదు అని వివాదాస్ప‌ద ఎంపీ జీవీఎల్ న‌ర్సింహారావు చేసిన కామెంట్స్ పొలిటిక‌ల్ హీట్ ను పెంచుతున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్రంలో అత్యంత బ‌ల‌హీనంగా ఉన్న బీజేపీ ఒక‌సారి ఎవ‌రేంటో తెలుసుకుని మాట్లాడాల‌ని వైసీపీ విజ్ఞ‌ప్తి చేస్తోంది. అదేవిధంగా కొంత స్థాయి పెంచి హెచ్చ‌రిక‌లు జారీ చేస్తోంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ రాజ‌కీయ యుద్ధంలో ఎవ‌రి భ‌విష్య‌త్ ఎవ‌రు నిర్ణ‌యిస్తారో అన్న‌ది కాల‌మే తేలుస్తుంద‌ని తాత్విక ధోర‌ణి ఒక‌టి ఇరు వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. ఇంత‌కూ జీవీఎల్ ఏమ‌న్నారంటే..

ఒక ఎన్నిక‌లోనే వెలిగే పార్టీ వైసీపీ అని, దానికి రాష్ట్రంలో భ‌విష్య‌త్ లేద‌ని తేల్చేశారు. డ‌బ్బా పార్టీ, డొక్కు ఫ్యాన్ పార్టీని చూసి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డిపోతున్నార‌న్నారు. రాష్ట్ర రాజ‌కీయాల‌పై బీజేపీ పూర్తి స్థాయిలో దృష్టి సారించింద‌ని, 2024 ఎన్నిక‌ల నాటికి రాష్ట్రంలో బ‌లీయ‌మైన శ‌క్తిగా ఎదిగి వైసీపీకి ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా నిలుస్తామ‌న్నారు. ఈ మాటలే ఇప్పుడు వైసీపీకి కోపం తెప్పిస్తున్నాయి.

ఎందుకంటే తాము బ‌లంగా ఉన్నామో లేదో లేదా తాము ఒక్క ఎన్నిక‌కే ప‌రిమితం అవుతామో లేదో అన్న‌ది జీవీఎల్ ఎలాచెప్ప‌గ‌ల‌ర‌ని ప్ర‌శ్నిస్తున్నారు వైసీపీ శ్రేణులు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో దేశంలోనే నంబ‌ర్ ఒన్ రాష్ట్రంగా ఆంధ్ర ప్ర‌దేశ్ ఉంద‌ని, బీజేపీ పాలిత రాష్ట్రాల‌లో కూడా ఇంత‌టి సంక్షేమం లేద‌ని అంటున్నారు. అదేవిధంగా ఒక ఎన్నిక‌లోనే వెలిగే పార్టీ వైసీపీ అన‌డం స‌బ‌బు కాద‌ని, తాము 2019 త‌రువాత జ‌రిగిన ప్ర‌తి ఎన్నిక‌లోనూ గెలిచి విజ‌య ఢంకా మోగించామ‌ని అంటున్నారు.

ఆఖ‌రుగా.. ఈ విధంగా ఆ రెండు పార్టీల మ‌ధ్య మాట యుద్ధం జ‌రుగుతోంది. ఎవ‌రి బ‌లం ఎవ‌రి ఉనికి వారే నిరూపించుకోవాలి కాపాడుకోవాలి. అదే రాజ‌కీయం కానీ జీవీఎల్ త‌మ శ‌క్తిని అంచనావేసుకోకుండా మాట్లాడ‌డంతోనే సిస‌లు ఇబ్బంది క‌ర పరిణామాలు వెల్లువెత్తుతున్నాయి అన్న‌ది ప‌రిశీల‌కుల మాట. ముందుగా క్షేత్ర స్థాయిలో ఇంకా చెప్పాలంటే బూత్ లెవ‌ల్ లో బీజేపీ త‌న‌కంటూ కార్య‌వ‌ర్గాన్ని నియ‌మించుకున్నాక అప్పుడు మాట్లాడితే బెట‌ర్ అన్న‌ది కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో నడుస్తున్న చర్చ.