KCR: 40 మంది ఎమ్మెల్యేలకు షాక్?

వచ్చే ఎన్నికల్లో 40 మంది ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వకూడదని కేసీయార్ డిసైడ్ చేసినట్లు సమాచారం. 119 నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ ఎంఎల్ఏల పరిస్దితి, ప్రతిపక్షాల ఎంఎల్ఏల పరిస్ధితులపై రాజకీయ వ్యూహకర్త, ఐప్యాక్ అధినేత  ప్రశాంత్ కిషోర్ (పీకే) తాజా నివేదికను కేసీయార్ కు అందించారట. రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై ఒకటికి పదిసార్లు ఇప్పటికే పీకే బృందం సర్వేలు జరిపింది.

అనేక సర్వేలు నిర్వహించి,  వివిధ కోణాల్లో విశ్లేషించి తయారు చేసిన నివేదికలో కచ్చితంగా 40 మంది ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వకూడదని సిఫారసు చేసిందట. ప్రతి ఎంఎల్ఏ విషయంలో పీకే బృందం సవివరమైన నివేదికను అందించిందట. అందులో మంత్రులు, ఎంఎల్ఏలకున్న ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లపై అనేక ఉదాహరణలు, వివరణలు ఇచ్చారట. అవన్నీ కేసీయార్ నాలుగు రోజుల పాటు జాగ్రత్తగా పరిశీలించినట్లు సమాచారం.

ఏఏ అంశాలపై ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత ఉంది, ఎలాంటి అంశాలపై ప్రభుత్వం విషయంలో జనాల్లో సానుకూలత ఉందనే విషయాలను కూడా పీకే టీమ్ వివరంగా చెప్పిందట. దీని ప్రకారమే కేసీయార్ తన ఎన్నికల ప్రణాళికలను రెడీ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అంశాలను పార్టీ ఎలా అధిగమించాలనే ప్రశ్న కేసీయార్ కు ఎదురైనపుడు చాలామంది ఎంఎల్ఏలను మార్చటం ఒక మార్గంగా పీకే చెప్పారట. ప్రభుత్వం మీద జనాల్లో పెరుగుతున్న వ్యతిరేకత ప్రధానంగా కొందరు మంత్రులు, ఎంఎల్ఏల కారణంగానే పెరుగుతున్నట్లు పీకే ఉదాహరణలతో సహా వివరించారట.

ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్లలో డబ్బులు దండుకోవటం, భూ వివాదాల్లో తలదూర్చుతున్న ఎంఎల్ఏలు డబ్బులు ఎలా సంపాదిస్తున్నది, ప్రజలను ఏ రకంగా ఇబ్బందులు పెడుతున్నారనే విషయాన్ని తన నివేదికలో పీకే స్పష్టంగా ఉదహరించారట. కొందరు మంత్రులు, ఎంఎల్ఏల కారణంగానే ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెరుగుతున్నట్లు పీకే అభిప్రాయపడ్డారని సమాచారం. అందుకనే తీవ్ర స్ధాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న 40 మంది ఎంఎల్ఏలను మార్చాల్సిందే అని పీకే స్పష్టంగా చెప్పారట. ఇదే సమయంలో ప్రతిపక్షాల్లో ప్రజాబలం ఉన్న నేతల వివరాలను కూడా తన నివేదికలో పీకే చెప్పారట. మరి చివరకు కేసీయార్ ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది.