‘ఇంగ్లీష్ మీడియం వ‌ల్లే.. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థులు త‌ప్పారు’

పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందనే విమర్శలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ ఏడాది మాల్ ప్రాక్టీస్కు బ్రేక్ పడటంతో పదిలో ఉత్తీర్ణత శాతం తగ్గిందన్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్లే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండవచ్చన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం వల్లే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండవచ్చని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దీన్ని తాము పట్టించుకోమన్నారు. ఇంగ్లీష్ మీడియం అమలుతో తొలుత కొన్ని సవాళ్లు, ఇబ్బందులు ఉంటాయని సీఎం కూడా చెప్పారని ఆయన అన్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా పోటీ పరీక్షల్లో ముందుకెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఇంగ్లీష్ మీడియం వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయని సజ్జల అన్నారు.

ఈ ఏడాది పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిందనే విమర్శలపై సజ్జల స్పందించారు. ‘పరీక్షల్లో మాల్ ప్రాక్టీసులకు తావు లేకుండా కఠినంగా వ్యవహరించడం తప్పా? పారదర్శకంగా పది పరీక్షలు జరిపామా లేదా అనేదే ప్రామాణికం. నారాయణ, చైతన్య, కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు కాన్సర్లా తగులుకొని పరీక్షలకే అర్థం మార్చేశాయి. గతంలో ఎడాపెడా మాల్ ప్రాక్టీసులు చేసి 90 శాతం పైగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది మాల్ ప్రాక్టీస్కు బ్రేక్ పడటంతో పదిలో ఉత్తీర్ణత శాతం తగ్గింది’ అన్నారు.

ఇంతకాలం 90 శాతంపైగా ఉత్తీర్ణత ఎలా వచ్చిందో.. విమర్శలు చేసేవారు సంజాయిషీ ఇవ్వాలి. రెండేళ్లపాటు కొవిడ్ వల్ల విద్యా సంస్థలు సరిగా నడవలేదు. రెండేళ్లుగా పరీక్షలు లేకపోవడంతో పోటీకి అవసరమైన స్ఫూర్తి విద్యార్థుల్లో తగ్గి ఉండొచ్చు. ఫెయిల్ అయిన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ చర్యలతో పదో తరగతి పిల్లలు, తల్లిదండ్రులు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు అని సజ్జల చెప్పారు.