మూడేళ్ళల్లో రాజధాని నిర్మిస్తారట

బీజేపీ చీఫ్ సోము వీర్రాజు మాటలు కోటలు దాటిపోతున్నాయి. తాము అధికారంలోకి వస్తే మూడేళ్ళల్లో అమరావతి రాజధానిని నిర్మించేస్తామన్నారు. మొదటి సంతకం రాజధాని నిర్మాణంపైనే పెడతారట. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కేవలం అమరావతి నిర్మాణానికి మాత్రమే రు. 10 వేల కోట్లు తెప్పిస్తామన్నారు. తాజాగా వీర్రాజు మాటలు చూసిన తర్వాత మాటలు కోటలు దాటుతున్నాయనే సామెత గుర్తురాకమానదు.

ఎందుకంటే మూగవాడు అమ్మా అనేదెప్పుడనే సామెతలాగ బీజేపీ అధికారంలోకి వచ్చేదెపుడు ? అమరావతి రాజధానిని నిర్మించేదెపుడు ? రాజధాని నిర్మాణాన్ని పక్కనపెట్టేస్తే అసలు ఎన్నికల్లో పోటీచేయటానికి 175 నియోజకవర్గాల్లోను బీజేపీకి అభ్యర్ధులున్నారన్నా అన్నదే అసలైన పాయింట్. ఎందుకంటే నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేయటానికే పార్టీకి అభ్యర్ధి దొరకటంలేదు.

ఆత్మకూరులో ఉపఎన్నిక జరుగుతుందని అందరికీ ఎప్పుడో తెలుసు. అయినా ఇప్పటివరకు ఇక్కడినుండి పోటీచేయటానికి ఒక అభ్యర్ధిని రెడీచేసుకోలేకపోయారు. ఆత్మకూరులో పోటీచేయటానికి సీనియర్లు ఎవరు ముందుకు రావటంలేదు. బిజివేముల రవీంద్రనాద్ అనే కొత్తనేత ముందుకొచ్చినా సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. అంటే సీనియర్లు ముందుకు రావటంలేదు, కొత్తగా చేరిన వారికి టికెట్ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నారు. పార్టీ పరిస్ధితి ఇక్కడ విచిత్రంగా ఉంది.

ఒక్క నియోజకవర్గంలో అభ్యర్ధిని రెడీచేసుకోలేకపోయిన పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేస్తుందని చెబితే జనాలు నమ్ముతారా ? ఏదో వీర్రాజు కాస్త కామెడీ చేస్తున్నారని అందరు కాసేపు నవ్వుకుని ఆ మాటలను మరచిపోతారంతే. మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓట్లు 0.56 శాతం. నన్ ఆఫ్ ది ఎబోవ్ (నోటా)కు వచ్చిన ఓట్లు 3 శాతం అంటేనే ఏపీలో పార్టీ పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది. రేపటి ఎన్నికల్లో అయినా ఇంతకన్నా భిన్నంగా ఉండే అవకాశంలేదు. ఎందుకంటే నరేంద్రమోడీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుండి ఏపీకి చేసిన మేలు ఏమీ లేకపోగా ప్రయోజనాలను తుంగలో తొక్కేసింది మాత్రం జనాలకు స్పష్టంగా కనిపిస్తోంది.