వైసీపీలో కొత్త కుంపటి

నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి అధికార వైసీపీలో కొత్తకుంపటి మొదలైంది. మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు ఈరోజు పెద్ద బాంబే వేశారు. అదేమిటంటే వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్ధిగా అయినా సరే పోటీచేసి గెలుస్తానంటు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుత ఎంఎల్ఏ ముదునూరి ప్రసాదరాజుతో కొత్తపల్లికి ఏమాత్రం పడటంలేదని అందరికీ తెలిసిందే.

జిల్లాల పునర్వవ్యస్ధీకరణలో నరసాపురంను జిల్లా కేంద్రంగా చేయటంలో ఎంఎల్ఏ ఫెయిలైనట్లు ఆ మధ్య కొత్తపల్లి నానా గొడవ చేసిన విషయం తెలిసిందే. ప్రసాదరాజును ఎంఎల్ఏగా గెలిపించి తాను తప్పుచేసినట్లు అందరి ముందు చెప్పుతో కొట్టుకున్నారు. నిజానికి ప్రసాదరాజును ఎంఎల్ఏగా గెలిపించేంత సీన్ కొత్తపల్లికి లేదని అందరికీ తెలిసిందే. 2004లో ఒకసారి, 2012లో ఉపఎన్నికలో గెలిచారు. విచిత్రం ఏమిటంటే కొత్తపల్లి టీడీపీ, కాంగ్రెస్, పీఆర్పీ, వైసీపీ అన్నీపార్టీలను చుట్టేశారు. నియోజకవర్గంలో ఈయనకు పెద్ద క్రెడిబులిటి కూడా లేదు.

ఏదో తాను పోటీ చేసిన పార్టీకి గాలుంటే కొత్తపల్లి గెలుస్తారు లేకపోతే ఓడిపోవటమే. ఇలాంటి కొత్తపల్లి కూడా ప్రసాదరాజు గెలిపించి తప్పుచేశానని చెప్పటమే విచిత్రం. తనకు గనుక టికెట్ రాకపోతే అంటున్న కొత్తపల్లికి టికెట్ రాదని బాగా తెలుసు. అందుకనే జనసేన లేదా టీడీపీలోకి వెళ్ళటానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎంఎల్ఏపైన జనాల్లో బాగా వ్యతిరేకత ఉంటే చెప్పలేం కానీ లేకపోతే రాజుకే మళ్ళీ టికెట్ ఖాయంగా వస్తుంది.

ఈ విషయం బాగా తెలిసే సిట్టింగ్ ఎంఎల్ఏపైన ఎంత వీలుంటే అంత జనాల్లో వ్యతిరేకతను పెంచి చివరలో తాను జనసేన/టీడీపీలోకి జంప్ చేయటమే టార్గెట్ గా కొత్తపల్లి పెట్టుకున్నట్లున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తుంటే తాను సులువుగా గెలవచ్చని, ఒకవేళ పొత్తు లేకపోయినా అవకాశాన్ని బట్టి ఏదో పార్టీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకోవాలన్నది కొత్తపల్లి వ్యూహంగా వైసీపీలో ప్రచారం జరుగుతోంది. నిజానికి తాను ఔట్ డేటెడ్ పొలిటీషియన్ అయిపోయిన విషయం కొత్తపల్లికి తెలియటంలేదు. జనాల్లో ఏమాత్రం విశ్వసనీయత లేదు కాబట్టే ఇన్నిపార్టీలు మారి ఇన్నిసార్లు ఓడిపోతారా ?