వైసీపీ వ‌ల్లే మ‌హానాడు హిట్‌

వైసీపీ పాలనపై ప్రజల అసంతృప్తే.. మహానాడు గ్రాండ్ సక్సెస్ కు కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని చెప్పారు. వైసీపీ పనైపోయిందని వచ్చే ఎన్నికలు ఏకపక్షమేనని వ్యాఖ్యనించారు. పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ఇంతటి ప్రజా వ్యతిరేకత ఏ ప్రభుత్వంపైనా చూడలేదని అన్నారు.

పార్టీలో గ్రూపులకు చెక్ పడాల్సిందేనని.. ఎవరికీ మినహాయింపులు లేవని వెల్లడించారు. వైసీపీ పాలనపై ప్రజల అసంతృప్తే.. మహానాడు గ్రాండ్ సక్సెస్కు కారణమని అన్నారు. ఒంగోలు నేతలు సమష్టి కృషితో మహానాడును సక్సెస్ చేశారన్న చంద్రబాబు.. ఈ నమూనాను అన్ని జిల్లాలు పాటించాలని సూచించారు. ఓట్ల తొలగింపు విషయంలో గ్రామ స్థాయిలో నేతలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యకర్తల ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తెచ్చిన న్యూట్రిఫుల్ యాప్ సేవల గురించి ఆయన వివరించారు. నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి, అక్రమాలపై స్థానికంగా పోరాటం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూచించారు.

లోకేష్ ఫైర్‌

వైసీపీ సామాజిక న్యాయభేరికి జనాలు రారని… టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. అధికారులు బెదిరించి తీసుకొచ్చినా.. వారూ పారిపోతున్నారన్నారు. ‘‘వాస్తవాలు రాసే, చూపించే మీడియా ప్రతినిధులు వీపు వాయగొడతారా మేయర్ గారు! ఇదేం రౌడీయిజం? అధికారం మత్తులో నోరు పారేసుకోవద్దు. వీపులు మీడియా వాళ్లకే కాదు, మీకూ వుంటాయి. ఎప్పుడు మీ వీపులు విమానం మోత మోగిద్దామా అని నాలుగు కోట్లకి పైగా ఉన్న ఏపీ ఓటర్లు ఎదురు చూస్తున్నారు. మర్యాదగా మీడియా ప్రతినిధులకి క్షమాపణ చెప్పండి’’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

ఆత్మ‌కూరు ఉప పోరుకు దూరం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ఉప ఎన్నికకు టీడీపీ దూరంగా ఉండనుంది. మేకపాటి గౌతమ్రెడ్డి కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇవ్వడంతో గతం నుంచి వస్తున్న సంప్రదాయాన్ని పాటించాలని తెలుగుదేశం భావిస్తోన్నట్లు సమాచారం. గతంలో బద్వేలు ఉప ఎన్నికలోనూ ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న గౌతమ్ రెడ్డి హఠాన్మరణం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆత్మకూరులో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నిక సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.