రెడ్ల సింహ‌గ‌ర్జ‌న‌: మ‌ల్లారెడ్డిపై చెప్పులు.. రాళ్లు!

తెలంగాణ‌లోని మేడ్చ‌ల్‌.. ర‌ణ‌రంగంగా మారింది. మంత్రి మ‌ల్లారెడ్డి పాల్గొన్న‌స భ‌లో ప్ర‌జ‌లు ఆయ‌న‌పైనే రాళ్లు .. చెప్పులు విసిరేసి మ‌రీ.. నిర‌స‌న తెలిపారు. కొంద‌రు కుర్చీలు కూడా విసిరేశారు. మంత్రి ప్రసంగిస్తుండగానే ఈ విధంగా నిరసన తెలప‌డంతో ఒక్క‌సారిగా సంచ‌ల‌నం ఏర్ప‌డింది. మరి, ఎందుకిలా జరిగింది? మంత్రి ఏం మాట్లాడారు..? వాళ్లకు ఎందుకు కోపం వచ్చింది? అసలేం జరిగింది అంటే..?

తెలంగాణ మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో రెడ్ల ఐక్య కార్యాచ‌ర‌ణ స‌మితి ఆధ్వర్యంలో సింహగర్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి చేసిన ప్రసంగం.. కార్యక్రమానికి హాజరైన రెడ్లకు నచ్చలేదు. దీంతో.. ఒక్కసారిగా సభికుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. మంత్రి ప్రసంగాన్ని పలువురు నేతలు మధ్యలోనే అడ్డుకున్నారు.

ప్రసంగంలో భాగంగా మంత్రి మల్లారెడ్డి.. టీఆర్ ఎస్ స‌ర్కారు అమ‌లు చేస్తున్న‌ సంక్షేమ పథకాల గురించి వివరించారు. రాష్ట్రంలో మళ్లీ టీఆర్ ఎస్‌ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ను పొగుడుతూనే.. మంత్రి ఉపన్యాసం సాగింది. అయితే.. ప్రసంగంలో మంత్రి పదేపదే కేసీఆర్, టీఆర్ ఎస్‌ గురించి ప్రస్తావించటంతో.. తీవ్ర ఆగ్రహంతో కుర్చీలు పైకెత్తి సభికులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ ఎస్‌ ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న దళితబంధు లాగానే రెడ్లబంధు కూడా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

రూ.5 వేల కోట్లతో రెడ్ల కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని నినదించారు. అంతటితో ఆగకుండా.. మంత్రిపైకి చెప్పులు, రాళ్లు విసిరేసి గందరగోళం సృష్టించారు. ఊహించని ఈ పరిణామంతో మంత్రి మల్లారెడ్డి తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో సభ నుంచి వెనుదిరిగారు. వెళ్లిపోయే క్రమంలోనూ మంత్రి కాన్వాయ్పై రెడ్డి నేతలు దాడి చేశారు. కాన్వాయ్ వెనుక పరుగులు తీస్తూ మరీ.. నీటి సీసాలు, కుర్చీలు, రాళ్లు విసరడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పోలీసులు వలయంగా ఏర్పడి మంత్రి కాన్వాయ్‌కు రక్షణగా నిలిచారు. అతికష్టం మీద మంత్రి మల్లారెడ్డిని నిరసకారుల నుంచి తప్పించిన పోలీసులు.. సభా ప్రాంగణం నుంచి సురక్షితంగా బయటకు పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.