బీజేపీకి షాక్…ముఖ్య నేత‌కు రేవంత్ కాంగ్రెస్ కండువా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ టూర్ తో బీజేపీ క్యాడర్ లో ఫుల్ జోష్ వచ్చిందనుకుంటున్న స‌మ‌యంలో ఆ పార్టీకి ఊహించ‌ని షాక్ త‌గిలింది. రాష్ట్ర సర్కారుపై మోడీ విమర్శలు, రాష్ట్రలో అధికారంలోకి రానున్న‌ట్లు చేసిన కామెంట్లతో విజిల్స్, కేకలతో కార్యకర్తలు హోరెత్తించిన ఉత్సాహం ఇంకా కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే….బీజేపీ నేత బండ్రు శోభారాణి కాంగ్రెస్ లో చేరారు. అమెరికాలో ఆమె కాంగ్రెస్ కండువా క‌ప్పుకొన్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ మధుయాష్కీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించిన శోభారాణి ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రెండు రోజుల క్రితం  రాజీనామా చేశారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న బండ్రు శోభారాణి ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కాంగ్రెస్ లో చేరారు.

కాంగ్రెస్ నేతలు కండువా కప్పి శోభారాణిని పార్టీలోకి ఆహ్వానించారు. బండ్రుశోభారాణి గతంలో టీఆర్ఎస్, టీడీపీ, నవ తెలంగాణ, ప్రజారాజ్యం పార్టీల్లో పనిచేశారు. రెండేళ్ల క్రితం టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఆమె  రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చెందిన బండ్రు శోభారాణి బీజేపీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్‌లో చేర‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఇప్పటికే ఆలేరు కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా బీర్ల ఐలయ్య ఉన్నారు. ఆలేరు నుంచి పోటీ చేయాలనుకుంటున్న శోభారాణికి కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుందా అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో బీజేపీ తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న స‌మ‌యంలో, ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలోకి రాష్ట్ర స్థాయి నేత చేర‌డం… బీజేపీలోని అంత‌ర్గ‌త లుక‌లుక‌ల‌ను బ‌య‌ట‌పెడుతుంద‌ని అంటున్నారు.