అఖిల వైఖరి అర్ధమే కావటం లేదుగా ?

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైఖరి పార్టీ నేతలకు అర్ధమే కావటం లేదు. స్వయంగా చంద్రబాబు నాయుడు జిల్లాకు వస్తే పెద్దగా స్పందించలేదు. జిల్లాలోకి అడుగుపెట్టినపుడు దణ్ణం పెట్టేసి మాయమైపోయారు. రెండు రోజులు చంద్రబాబు జిల్లాలో తిరిగినా మళ్ళీ ఎక్కడా అడ్రస్ కనబడలేదు. మళ్ళీ  మహానాడు వేదిక మీద మాత్రం ప్రత్యక్షమయ్యారు. టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగసభ సందర్భంగా అఖిల తమ్ముడు జగద్విఖాత్యరెడ్డితో కలిసి వేదికమీద కనిపించారు.

వేదికమీద అఖిల కూర్చునున్నా ఎవరు కూడా పట్టించుకున్నట్లు లేదు. కాకపోతే మాజీమంత్రి కాబట్టి వేదికమీద కూర్చోవటానికి ఎవరు అడ్డుచెప్పలేదంతే. నిజానికి ఈమెను జిల్లాలోని నేతల్లో అత్యధికులు దూరం పెట్టేశారు. ఈమెకు ఎవరితోను పొసగడం లేదు. సీనియర్లను గౌరవించాలని కూడా మాజీమంత్రికి తెలియదనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందుకనే ఈమెకు అందరు దూరంగానే ఉంటారు. పార్టీ సమావేశాలకు కూడా ఈమెను పిలవటం మానుకున్నారట.

చిన్నవయసులోనే కారుణ్య నియామకం కోటాలో మంత్రి అయిపోయిన అఖిల చాలా దుడుకు మనిషి. అందుకనే అందరితోను ఎప్పుడూ గొడవలు పడుతునే ఉంటారు. ఈ దంపతుల మీద హత్యాయత్నం, కిడ్నాపులు, ఫోర్జరీ, భూ ఆక్రమణల్లాంటి కేసులు చాలా ఉన్నాయి. గడచిన మూడేళ్ళల్లో టీడీపీ నేతల్లో ఇంతగా ఇమేజ్ డ్యామేజ్ అయిన నేత మరొకరు లేరనే చెప్పాలి. ఈ కారణంతోనే చంద్రబాబు, లోకేష్ కూడా ఈమెను దూరం పెట్టారని పార్టీలోనే టాక్ నడుస్తోంది.

అందుకనే ఈమె పార్టీ కార్యక్రమాలకు వచ్చినా ఎవరు పట్టించుకోరు, రాకపోయినా ఎవరూ పట్టించుకోరు. వచ్చే ఎన్నికల్లో ఆళ్ళగడ్డలో తానే టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తానని అఖిల నియోజకవర్గంలో చెప్పుకుంటు తిరుగుతున్నారు. అయితే ఈమెకు టికెట్ వచ్చే అవకాశాలు లేవని ఈమె బద్ధ విరోధి, సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి వర్గం ప్రచారం చేస్తోంది. ఎందుకంటే ఇక్కడనుండి పోటీకోసం ఏవీ కూడా గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మహానాడుకు హాజరు కాకపోతే మొదటికే మోసం వస్తుందని అఖిల భయపడినట్లున్నారు. అందుకనే ఎవరు పట్టించుకోకపోయినా వేదిక మీద కూర్చున్నారు.