ముంద‌స్తుకు కేసీఆర్‌… కానీ ఒక‌టే స‌మ‌స్య‌!?

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్  మ‌దిలో ముంద‌స్తు ఎన్నిక‌లు మెదులుతున్నాయా?  గ‌త కొద్దికాలంగా చ‌ర్చ‌ల్లో ఉంచిన కేవ‌లం రాజ‌కీయ వ‌ర్గాలు మాత్ర‌మే చ‌ర్చ‌ల్లో ఉంచిన అంశాన్ని ఇప్పుడు ఏకంగా త‌న పార్టీ ముఖ్యుల‌తో క‌లిసి ఎందుకు ప్ర‌చారంలో ఉండేలా చేస్తున్నారు?  వ్యూహాత్మ‌కంగానే త‌న ఎన్నిక‌ల అజెండాను ఆయ‌న వ్య‌క్తం చేస్తున్నారా? ఈ చ‌ర్చ తాజాగా బీజేపీపై ఎదురుదాడి చేసే క్ర‌మంలో తెర‌మీద‌కు వ‌స్తోంది.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తెలంగాణ పర్య‌ట‌న సంద‌ర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీపై విమ‌ర్శ‌లు చేయ‌డం తెలిసిన సంగ‌తే. దానికి తాజాగా టీఆర్ఎస్ త‌ర‌ఫున కౌంట‌ర్ వ‌చ్చిన స‌మ‌యంలో ఏకంగా ముంద‌స్తు ఎన్నిక‌లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌యంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ ప్రెస్ మీట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి త‌లసాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మాట్లాడుతూ, మోడీ మరోసారి తెలంగాణ పై మరో సారి తన అక్కసు ప్రదర్శించార‌ని మండిప‌డ్డారు.

భారత్ బయోటెక్ సంద‌ర్శ‌న‌కు వచ్చినపుడు సీఎంను రావొద్దని మోడీ సూచించార‌ని పేర్కొన్న త‌ల‌సాని అక్కడే కొత్త సంప్రదాయానికి బీజం పడింద‌ని పేర్కొన్నారు. “కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకివ్వలేదు?  ఐటీఐఆర్ ఎందుకు కేటాయించడం లేదు?  రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక అంశాల్లో ఎందుకు త‌గు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదో… మోడీ గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పాలి“ అని త‌ల‌సాని డిమాండ్ చేశారు. తెలంగాణ కు ఈ ఎనిమిదేళ్లలో మోడీ ఎం చేశారో చెప్పాల‌ని త‌ల‌సాని స‌వాల్ విసిరారు.

తెలంగాణలో పుట్టిన వారు బీజేపీకి, మోడీకి భయపడర‌ని త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ అన్నారు. మోడీ చుట్టపు చూపులా వచ్చి తిట్టి పోతే పడటానికి ఎవ్వరూ సిద్ధంగా లేర‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. తెలంగాణలోబీజేపీ అధికారం లోకి వస్తుంద‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కామెంట్ చేయ‌డం చిత్రంగా ఉంద‌ని త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ వ్యాఖ్యానించారు. “దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేయి.. మేము సీఎంతో మాట్లాడి అసెంబ్లీ రద్దు చేస్తాం. ఎన్నికలకు వెళదాం. ఎవరు గెలుస్తారో చూద్దాం“ అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీపై విమ‌ర్శ‌లు చేస్తున్న స‌మ‌యంలో… తెలంగాణ‌ ప్ర‌భుత్వం గురించి చ‌ర్చ‌ల్లో ఉన్న ముంద‌స్తు ఎన్నిక‌ల గురించి మంత్రి త‌ల‌సాని  శ్రీ‌నివాస్ యాద‌వ్ మాట్లాడ‌టం ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌దిలో ఉన్న మాట‌నే త‌ల‌సాని వ్య‌క్తం చేసిన‌ట్లున్నార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.