మ‌హానాడు.. తెలుగు జాతి పండ‌గ‌: చంద్ర‌బాబు

మహానాడు కేవ‌లం టీడీపీ పండుగ మాత్ర‌మే కాద‌ని.. తెలుగుజాతికి పండుగ అని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. చరిత్ర ఉన్నంత వరకూ టీడీపీ ఉంటుందన్నారు. టీడీపీ ఉన్నంత వ‌ర‌కు మ‌హానాడు ఉంటుంద‌న్నారు. పసుపు రంగు చూస్తే చైతన్యం వస్తుందన్నారు. రాజకీయం అంటే తమాషా కాదన్నారు. రాష్ట్రంలో ఉన్మాది పాలన కొనసాగుతోందన్నారు. చేతకాని దద్దమ్మ జగన్  వల్ల రాష్ట్రం పరువు పోతోందన్నారు.

ఇంకా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘టీడీపీ కార్యకర్తలను ఎంతగా ఇబ్బంది పెడితే.. అంతగా రెచ్చిపోతారు. రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాడుతాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాదుడే బాదుడు. వైసీపీ  తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. ఎవరు తప్పు చేసినా వదిలేది లేదు. ప్రజా సమస్యలపైనే మన పోరాటం. రాష్ట్రంలో ఏ రైతు ఆనందంగా లేరు. దిక్కుతోచని పరిస్థితుల్లోనే రైతుల ఆత్మహత్యలు.

రైతు సమస్యల పరిష్కారం పోరాటం చేస్తాం. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు. రోడ్డు మీదకు రండి… మీకు అండగా మేము ఉంటాం.“ అని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలపైనే టీడీపీ పోరాడుతుంద‌ని తెలిపారు.  పెట్రోల్‌ ధరలు కేంద్రం తగ్గించినా వైసీపీ ప్రభుత్వం తగ్గించడం లేదన్నారు. ఇంటిపన్ను, చెత్తపన్ను, డ్రైనేజీ ట్యాక్స్‌ అన్నీ పెంచేశారని దుయ్య‌బ‌ట్టారు. “రాష్ట్రంలో ఏ రైతు అయినా ఆనందంగా ఉన్నాడా? అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారు.

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. రోడ్లపైకి రండి. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయి. మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరేసే పరిస్థితి తీసుకోస్తారా? రాష్ట్రంలో నిత్యావసరాలు కొనే పరిస్థితి లేదు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను తీసేశారు. విదేశీ విద్య, పెళ్లి కానుక పథకాలన్నీ ఏం చేశారు?‘‘ అని  నిల‌దీశారు. మొత్తానికి చంద్ర‌బాబు వాడి వేడి ప్ర‌సంగం ఆసాంతం.. మ‌హానాడుకు హైలెట్‌గా నిలిచింది.