దీనికి వైసీపీ క్యాంప్ స‌మాధానం ఏంటో మ‌రి

రఘురామకృష్ణంరాజు… నరసాపురం ఎంపీ. ఇప్పుడు ఆయ‌నో హాట్ టాపిక్. వైసీపీ ఎంపీ అయిన‌ప్ప‌టికీ…సొంత పార్టీ నేత‌ల‌కే ఆయ‌న‌ పంటి కింద రాయి. క‌ల‌క‌లం సృష్టించే కామెంట్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌.

పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం, నరసాపురం టీడీపీకి కంచుకోటేనని ప్ర‌క‌టించ‌డం, తనకు ప్రాణహాని ఉందంటూ లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాయ‌డం వంటి చ‌ర్య‌లెన్నింటితో వైసీపీ నేత‌లకు‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు బీపీ పుట్టిస్తున్నారు. తాజాగా ఆయ‌న‌కు వైసీపీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఈ స‌మ‌యంలో వైఎస్ జ‌గ‌న్ ధైర్యం గురించి, ఆయ‌న కామెంట్ల గురించి రాజ‌కీయ వ‌ర్గాల్లో కొత్త చ‌ర్చ ‌తెర‌మీద‌కు వ‌స్తోంది.

తన సొంత నియోజకవర్గానికి వస్తే చంపేస్తామని, కాళ్లు, చేతులు తీసేస్తామని బెదిరిస్తున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణమరాజు ఆరోపించారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని మండిపడ్డారు. తనకు ప్రాణహాని ఉండడంతోనే రక్షణ కల్పించాలి అంటూ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు.

కరోనా విషయంలో ఒక అధికారిణి పై ప్రతిపక్ష పార్టీకి చెందిన అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేస్తే.. నిర్భయ కేసు పెట్టిన రాష్ట్ర పోలీసులు.. తనకు ప్రాణానికి హాని ఉందని ఫిర్యాదు చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఎంపీ లేఖపై చర్యలు తీసుకున్న స్పీకర్ ఓంబిర్లా రఘురామ కృష్ణమరాజు ఫిర్యాదును హోంశాఖకు పంపారు. ఇలా ఇటు న‌ర‌సాపురం గ‌ల్లీ అటు ఢిల్లీలో ర‌ఘురామ కృష్ణంరాజు కాక ‌పుట్టిస్తున్నారు.

ర‌ఘురామ కృష్ణంరాజు దూకుడు వెనుక ప్ర‌ధాన కార‌ణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ అని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న బీజేపీ నేత‌ల‌తో ట‌చ్‌లో ఉన్నార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ దైర్యం గురించి చెప్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎదిరించి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వ‌చ్చార‌‌ని…అక్ర‌మ కేసులు ఎదుర్కున్నార‌‌ని అయినా ధైర్య‌వంతుడు కాబ‌ట్టి ప్ర‌జాక్షేత్రంలో నిలుస్తున్నార‌ని వైసీపీ నేత‌లు చెప్తుంటారు.

అయితే, ఇప్పుడు సొంత ఎంపీ కొత్త స్కెచ్‌తో ముందుకు సాగుతుంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ మ‌ద్ద‌తుతోనే ఇలా జ‌రుగుతోంద‌నే మాట‌ను వైసీపీ నేత‌లు కానీ అధినేత ఎందుకు ప్ర‌స్తావించ‌డం లేద‌ని ప‌లువురు కొత్త కామెంట్‌ను తెర‌మీద‌కు తెస్తున్నారు. దాదాపు ప‌దేళ్ల కింద‌టి ఆత్మాభిమానం/ ధైర్యం/తిరుగుబాటు సంగ‌తి ఓకే కానీ…ప్ర‌స్తుతం అవి ఎందుకు క‌నిపించ‌డం లేద‌ని జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్థి క్యాంప్ ప్ర‌శ్నిస్తోంది. దీనికి వైసీపీ క్యాంప్ స‌మాధానం ఏంటో మ‌రి.