మోడీ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి: రేవంత్ డిమాండ్‌

తెలంగాణ ఏర్పాటు గురించి ప్రధాని న‌రేంద్ర‌ మోడీ అవమానించేలా మాట్లాడారని.. నేడు హైదరాబాద్‌కు వ‌చ్చిన‌ ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపక్షణ చెప్పాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా 9 అంశాలను ప్రస్తావిస్తూ బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీజేపీ, టీఆర్ఎస్‌ విఫలమయ్యాయని దుయ్య‌బ‌ట్టారు.

ప్రధాని మోడీకి 9 ప్రశ్నలు సంధిస్తూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ఏర్పాటుపై చేసిన వ్యాఖ్యల పట్ల ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరంలో అవినీతిపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని నిల‌దీశారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు హామీని నెరవేర్చుతారా? లేదా? స్పష్టత ఇవ్వాలని కోరారు.

విభజన హామీల్లో భాగంగా బయ్యారం స్టీల్‌ ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ.. ఐటీఐఆర్‌ ప్రాజెక్టులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని రేవంత్‌ ప్రశ్నించారు. నైనీ కోల్‌ మైన్స్‌ టెండర్లలో అవినీతి జరిగిందని ఆధారాల తో సహా ఆరోపించామన్న రేవంత్‌రెడ్డి… గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటులో జాప్యం ఎందుకు జరుగు తోందో చెప్పాలన్నారు. రామాయణం సర్క్యూట్‌ ప్రాజెక్ట్‌లో భద్రాద్రి రాముడికి చోటెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

టీఆర్ ఎస్‌, బీజేపీ ఉప్పు-నిప్పు అన్నట్లుగా నాటకమాడుతున్నాయి. బీజేపీ, టీఆర్ ఎస్ మధ్య చీకటి బంధం ప్రజలకు తెలుసు. విద్యుత్‌ సంస్కరణలు కేసీఆర్‌ అంతర్లీనంగా అమలు చేస్తున్నారు. కాళేశ్వరంలో అవినీతిని ప్రధాని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? కర్ణాటకలో అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు? విభజన చట్టం ప్రకారం రావల్సిన గిరిజన వర్సిటీ అతీగతీ లేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి తీవ్రంగా క్షోభ పెడుతున్నారు. అని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.