కాంగ్రెస్ సీరియస్ గానే రెడీ అవుతోందా?

వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గానే రెడీ అవుతున్నట్లుంది. పార్టీలో పునరుత్తేజం నింపటానికి అధినేత్రి సోనియాగాంధీ మూడు కమిటిలను నియమించారు. రాజస్ధాన్లోని ఉదయపూర్లో మొన్న మూడు రోజులు జరిగిన చింతన్ శిబిర్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల తర్వాత సీరియస్ గానే కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే మూడు కమిటీలు నియమించింది. మొదటిదేమో రాజకీయ వ్యవహారాల కమిటీ, రెండోదేమో టాస్క్ ఫోర్స్.

ఇక మూడో కమిటీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పార్టీ మొదలు పెట్టనున్న పాదయాత్ర భారత్ జోడో కార్యక్రమం రూపకల్పన కమిటీ. మొదటి రెండు కమిటీలకు సోనియాగాంధీ, చిదంబరం నాయకత్వం వహించబోతున్నారు. వీరిలో సీనియర్లు, జూనియర్లు ప్రాతిపదికగా సభ్యులను నియమించారు. టాస్క్ ఫోర్స్ కమిటీలో పార్టీ వ్యవహారాలు, కమ్యూనికేషన్, మీడియా, సోషల్ మీడియా, ఆర్థిక వనరుల సమీకరణ లాంటి కీలకమైన అంశాలున్నాయి.

అక్టోబర్లో 2వ తేదీ నుంచి మొదలయ్యే భారత్ జోడో కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలో సెంట్రల్ ప్లానింగ్ గ్రూపును సోనియా నియమించారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే పార్టీ పదవుల్లో ఇకనుండి 50 శాతం యువతకే కేటాయించాలన్న నిర్ణయాన్ని నాయకత్వం తుంగలో తొక్కేసింది. రాజకీయ వ్యవహారాల కమిటీ, టాస్క్ ఫోర్స్ బృందంలో ఇప్పటివరకు ఉన్న నేతలనే నాయకత్వం రెన్యువల్ చేసింది. ఈ రెండు కమిటిల్లో ఉన్నవారంతా పాతవారే.

టాస్క్ ఫోర్స్ లో నియమితుడైన హైదరాబాద్ కేంద్రంగా మైండ్ షేర్ అనలిటిక్స్ సంస్ధ అధినేత సునీల్ కానుగోలు యువకుడి కిందే లెక్క. భారత్ జోడో కార్యక్రమంలో నియమితులైన సచిన్ పైలెట్, రవ్ నీత్ బిట్టు, జ్యోతిమణి లాంటి వాళ్ళు మాత్రమే 50 ఏళ్ళ వయసువారు. ఎందుకంటే వీరు రాహుల్ గాంధీతో పాటు పాదయాత్రలో పాల్గొనాల్సుంటుదేమో. అందుకనే భారత్ జోడో పర్యవేక్షణ కమిటీలో మాత్రం యువకులను వేశారు. మొత్తానికి భారత్ జోడో కార్యక్రమం మొదలైన తర్వాత పార్టీకి ఊపు వస్తుంది అని నాయకత్వం భావిస్తోంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పాదయాత్రంటే మామూలు విషయం కాదు.